మరో 2.72 లక్షల మందికి నేడు వైఎస్సార్‌ చేయూత 

YSR Cheyutha To Above 2 Lakh People Again - Sakshi

ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున రూ.510.01 కోట్లు

సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే తపనతో నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పథకాలు అందించాలనే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యానికి అనుగుణంగా వైఎస్సార్‌ చేయూత కింద మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం ఆర్థిక సాయం అందించనున్నారు. రెండో ఫేజ్‌ కింద 45  నుంచి 60 ఏళ్లలోపు 2,72,005 మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.510.01 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందజేస్తారు. ఆగస్టు 12న వైఎస్సార్‌ చేయూత కింద 21,00,189 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నగదు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎవరైనా మిగిలిపోయి ఉంటే పేర్లు నమోదు చేసుకునేందుకు నెల గడువు ఇస్తున్నామని, అందులో అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన 2,72,005 మంది మహిళల ఖాతాలకు నేడు రూ.510.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది. దీన్ని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రారంభిస్తారని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top