సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖకు బయిలుదేరనున్నారు. అదేవిధంగా నిన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
నిన్న ( సోమవారం) సాయంత్రం 150 టన్నుల ద్రవపు ట్రక్కున మెుసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్పోటనం చెందింది. దీంతో అది కార్మికులపై పడి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా ఈ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ ఇదివరకే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో రేపు స్వయంగా వైఎస్ జగన్, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, బాధిత కుటుంబాలను కలువనున్నారు.


