
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి మృతులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులర్పించారు. గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులర్పించారు.
సమావేశం ప్రారంభంలో.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam Attack)లో ఉగ్రవాదులు జరిపిన ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ భేటీలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఇంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్.. ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారారాయన. ఈ క్రమంలో.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి కూడా.
