AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య | Young Man Lost His Life In Krishna District | Sakshi
Sakshi News home page

AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

Jun 26 2025 11:04 AM | Updated on Jun 26 2025 11:40 AM

Young Man Lost His Life In Krishna District

సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్‌ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు.  మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్‌ను ఎస్‌ఐ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్‌ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్‌ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధువుల ఆందోళన 
ఎస్‌ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్‌ఐలు చాణక్య, రాజేష్‌ వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్‌ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని  మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement