మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు | Wrong vote To Anganwadi teacher | Sakshi
Sakshi News home page

మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు

May 14 2024 11:35 AM | Updated on May 14 2024 11:35 AM

Wrong vote To Anganwadi teacher

ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్‌కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లింది.

అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్‌ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్‌కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్‌ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్‌వాడీ టీచర్‌ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.

అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్‌కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్‌ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్‌ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్‌ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement