వాళ్లెవరో ఆధారాలతో చూపితే పాదపూజ చేస్తా
2024 ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన పది రోజులకు ఓటింగ్ శాతం ప్రకటన
ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల సంఘం
రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని, వీరంతా వీధుల్లోకి వచ్చి తమ ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని శనివారం గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, విశ్వసనీయత, పౌరసమాజం కర్తవ్యం’ అనే అంశంపై పరకాల ప్రభాకర్ స్మారకోపన్యాసం చేశారు.
సర్ పేరుతో సంచార జాతులు, వలస కార్మికులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని పరకాల ఆందోళన వ్యక్తంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో 2024 మే నెలలో పోలింగ్ పూర్తయిన తర్వాత 3,500 పోలింగ్ బూత్లలో 17.25 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని, రాత్రి 11 నుంచి తెల్లవారుజూమున 2 గంటల వరకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద నిలబడి ఓటు వేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
అలా ఓట్లు వేసినవారిని ఆధారాలతో చూపితే తాను వారికి పాదపూజ చేస్తానని పరకాల చెప్పారు. సర్ ప్రక్రియ ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్న ఎన్నికల సంఘం ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


