ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..! | Vizianagaram Parents incident | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!

Apr 27 2025 8:35 AM | Updated on Apr 27 2025 8:35 AM

Vizianagaram Parents incident

ట్రాక్టర్‌తో ఢీకొట్టించడంతో ప్రాణాలు విడిచిన దంపతులు 

 విజయనగరం జిల్లాలో దారుణ ఘటన 

పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. 

ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్‌ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. 

ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్‌ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్‌ సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement