శ్రీకాకుళం: లింగాలవలస పంచాయతీ సోర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల సమాచారం మేరకు.. దుంపల హరిణికి తన మేనమామ వెంకటేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. హరిణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. అక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు, హరిణికి మధ్య గొడవలు జరిగాయి. అయినప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బంధువులు హరిణిని గ్రామానికి రప్పించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో ఈ నెల 1న రాత్రి హరిణి ఆత్మహత్యకు పాల్పడిందంటూ 2వ తేదీ వేకువజామునే రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, హరిణికి కోచింగ్లో పరిచయమైన వ్యక్తి సమాచారం తెలుసుకుని శక్తి టీమ్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. వీఆర్వో రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


