రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం | Ultimatum of TDP workers to sku vc | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం

Jun 7 2024 5:27 AM | Updated on Jun 7 2024 5:43 AM

Ultimatum of TDP workers to sku vc

ఇక మా వాళ్లు వచ్చి పాలన చేస్తారు 

తక్షణమే వర్సిటీలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించండి 

ఎస్కేయూ వీసీ, రిజి్రస్టార్‌లకు టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ కార్యకర్తల అల్టిమేటం 

అనంతపురం: ‘మా ప్రభుత్వం వ చ్చింది. మావాళ్లే పాలిస్తారు. మీరంతా రాజీనామా చేసి వెళ్లిపోవాలి. అలాగే యూనివర్సిటీలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని శుక్రవారం ఐదు గంటల్లోపు తొలగించాలి. లేకపోతే మీ ఇష్టం..’ అంటూ తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) నాయ­కులు, టీడీపీ కార్యకర్తలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం­(ఎస్కేయూ) వీసీ కె.హుస్సేన్‌రెడ్డి,  రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్యలకు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు గురువారం ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద సంబరాలు నిర్వహించారు. 

అనంతరం రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య చాంబర్‌కు వెళ్లి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ‘ప్రభుత్వం మారింది. మాకు అనుకూలమైన అధికారిని నియమించుకుంటాం. వెంటనే వెళ్లిపోండి..’ అని హెచ్చరించారు. అనంతరం వీసీ హుస్సేన్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఎస్కేయూలో ఏర్పాటు­చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలన్నారు. ఇందుకోసం యూనివర్సిటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ను పిలిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో భయపడిన వీసీ యూనివర్సిటీ ఎస్‌ఈని పిలిపించారు. 

యూని­వర్సిటీలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఆయన్ను కూడా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి సీఐ, ఎస్‌ఐ చేరుకుని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వర్సిటీ ఉద్యోగి తిమ్మప్ప కూడా వీసీని బెదిరించడం మంచి పద్ధతి కాదని, క్రమశిక్షణగా ఉండాలని కోరారు. దీంతో వారంతా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఎప్పటిలోగా తొలగిస్తారో చెబితే తాము వెళ్లిపోతామన్నారు. ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్‌ విగ్రహం తొలగిస్తామని అధికారులు తెలిపారు. దీంతో టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ నాయకులు వెళ్లిపోయారు.   

అప్పటికప్పుడు పాలకమండలి సమావేశం 
ఎస్కేయూలో వైఎస్సార్‌ విగ్రహాన్ని పాలకమండలి అనుమతితో ఏర్పాటుచేసినందున విగ్రహం తొలగించేందుకు కూడా పాలకమండలి అనుమతి కావాలి. దీంతో వీసీ, రిజిస్ట్రార్‌ గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. యూనివర్సిటీలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు డిమాండ్‌ గురించి ప్రభుత్వానికి లేఖ రాసి, ప్రభుత్వ సూచన మేరకు వ్యవహరించాలని పాలకమండలి నిర్ణయించింది. 

కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో  జేఎన్‌టీయూ(ఏ)లో ఎన్టీఆర్‌ విగ్రహా­న్ని ఏర్పాటుచేశారు. ఆడిటోరియానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టా­రు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించలేదు. ఆడిటోరియం పేరును మా­ర్చలేదని, టీడీపీ ఇంకా అధికారం చేపట్టకమునుపే ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని విద్యార్థులు, అధ్యాపకులు తప్పుపడుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement