కృష్ణాజిల్లా: వెస్ట్ బైపాస్పై జక్కంపూడి షాబాద్ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆయా కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కబళించింది. అందులో ఒకరు తన కుమారుడి పెళ్లి వేడుక చేసి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా.. మరొకరు బైక్పై తన కొడుకుతో ప్రయాణిస్తున్నారు.
వివరాలు ఇవి..
రాజమండ్రి సీతంపేటకు చెందిన దువ్వూరి హరిప్రసాద్(52) పురోహితుడిగా చేస్తుంటాడు. హరిప్రసాద్ చిన్న కుమారుడి వివాహం ఉండటంతో కుటుంబం మొత్తం హైదరాబాద్ వెళ్లింది. పెళ్లి ముగించుకుని తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి పెళ్లి కొడుకు, పెళ్లికూతురుతో పాటు మిగిలిన వారందరూ ఒక కారులో, హరిప్రసాద్ తన బంధువుతో పాటు పెళ్లి సామగ్రి తీసుకుని మరో కారులో బయలుదేరారు. తన బంధువును గొల్లపూడి వద్ద దింపిన హరిప్రసాద్.. కారును వెస్ట్ బైపాస్ వైపు మళ్లించాడు.
మొదట బైక్.. ఆపై కంటైనర్ను ఢీకొట్టి..
జక్కంపూడి, షాబాద్ల మధ్య అండర్ పాస్ వద్దకు వచ్చే సరికి ఎదురు వెళ్తున్న బైక్ను హరిప్రసార్ కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డుకు పక్కనే నిలిపి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న పాయకాపురానికి చెందిన సూరిబోయిన హరికృష్ణ స్వల్పంగా, అతని తండ్రి గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే గురవయ్య మృతి చెందాడు. గురవయ్య బోయమడుగులకు వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురవయ్య కొంత కాలం కిందట గుండె ఆపరేషన్ చేయించుకోగా, మందుల కోసం గుంటూరు వెళ్లి తిరిగి పాయకాపురానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు పెద్దలు చనిపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం రోదనలతో విషాధ చాయలు అలముకున్నాయి.


