పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు | Transparent medical admissions | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు

Jul 7 2023 4:28 AM | Updated on Jul 7 2023 4:28 AM

Transparent medical admissions - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అడ్మి­షన్లు పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్‌ కోరుకొండ బాబ్జి తెలిపారు. అందుకు సంబంధించి అడ్మిషన్స్‌ విభాగం వారితో కలిసి మూడుసార్లు మాక్‌ ట్రయల్‌ నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని సీట్లు, అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాలను గురువారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. 

తెలంగాణ జీవోపై నిర్ణయం..  
2014 జూన్‌ రెండు తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల్లోని యూజీ సీట్లలో 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ఇచ్చేది లేదని అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో మంజూరైన ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు, పీజీ సీట్లు కూడా అన్‌ రిజర్వుడ్‌ కోటాలో తెలంగాణ విద్యార్థులకు నిలిపివేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,109 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో పోగా, మిగిలిన సీట్లకు ఇక్కడ అడ్మిషన్లు జరుపుతామన్నారు. 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయని, వాటిలో 50 శాతం.. 1,500 సీట్లను ఏ కేటగిరిలో భర్తీ చేస్తామని వీసీ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఒకేసారి డైనమిక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చిందని వీసీ తెలి­పారు. ఏపీ, తెలంగాణలకు విభజన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి నూతన విధానాన్ని అనుసరిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పీజీ, యూజీ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement