
14 మంది కామాంధుల కర్కశానికి బలైన దళిత మైనర్ బాలిక
దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజనాసుపత్రిలో మౌనరోదన
8 నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చిన వైద్యులు
రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు
సఖి సెంటర్కు తరలించేందుకు పోలీసుల యత్నం
కుదరదని చెబుతున్న వైద్యులు
ఈ ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాకపోతే పరిస్థితి ఏమయ్యేదోనంటున్న జనం
నాన్న చనిపోయాడు. అమ్మకు మానసిక వైకల్యం. నా అనే దిక్కులేదు. అమ్మకొచ్చే పెన్షన్తో బతుకీడుస్తూ, కష్టాల మధ్యే చదువుకుంటున్న తొమ్మిదో తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకుని మరీ నెలలు తరబడి కీచకపర్వం సాగింది. ఇప్పుడా బాలిక జీవితం అగమ్యగోచరంగా మారింది.
పద్నాలుగు మంది కామాంధుల కర్కశానికి బలైన ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక 8 నెలల గర్భంతో అనంతపురంలోని సర్వజనాసుపత్రిలో బేలచూపులతో మౌనంగా రోదిస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం
వెలుగులోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి?
ఈ దారుణాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదోనని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరు ఊరంతా టీడీపీ వర్గం కావడం.. ఏదైనా బయటకు చెబితే ప్రమాదం ఉండటంతో బాలిక ఎక్కడా నోరెత్తలేకపోయింది. కరుణ చూపాల్సిన పెద్దమనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్ చేయించాలని నిందితులను తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడుగడుగునా అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టొద్దని గట్టిగానే చెప్పారు. అప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు.
బాధితురాలి పరిస్థితి దయనీయం
బాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్ 6.3 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. సాధారణ మహిళకు 10 శాతంపైనే ఉండాలి. గర్భిణికి 11.5కు పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలికకు కేవలం 6.3 శాతం ఉండటంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
బడికి వెళ్లాల్సిన వయసులో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది.బాలికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వెళ్లారు. ఇప్పుడేమో వార్డులో అందరిలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాన్పుకు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటేనే దయనీయంగా ఉంది. కనీసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.
సఖి సెంటర్కు తరలించాలన్న పోలీసులు
రామగిరి సీఐ ఆస్పత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖి సెంటర్కు తరలించాలని అడిగినట్టు తెలిసింది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్యసేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖి సెంటర్కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆస్పత్రికి అయితే రోజూ వందల మంది వస్తుంటారు. మీడియా ప్రతినిధులూ వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచార విషయంపై రోజూ చర్చ జరుగుతుందన్న కారణంగా పోలీసులు బాధితురాలిని సఖి సెంటర్కు తరలించేందుకు ప్రయత్నించారు.
అంధకారంలో బాలిక భవిష్యత్
బాధితురాలి భవిష్యత్ అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అబార్షన్ చేసి తీసేయలేమని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లీ బిడ్డ ఎలా బతకాలి? ఆ ఊర్లో ఉండగలరా? నిందితులకు శిక్ష పడ్డాక ఈ అమ్మాయిని ఆ ఊర్లోకి టీడీపీ నేతలు రానిస్తారా? ఒకవేళ పోలీసు బందోబస్తు మధ్య అమ్మాయి ఊర్లోకి వెళ్లినా ఆమెను బతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్న ప్రశ్నలు.
పరామర్శ లేదు.. ప్రభుత్వ సాయమూ లేదు
ఈ అభాగ్యురాలి విషయం వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు దాటినా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలేదు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాలిని పరామర్శించిన పాపాన పోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం.. ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండటం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల్లోనే మూడు హత్యలు జరిగాయి. ఒక అత్యాచారమూ జరిగింది. వీటన్నిటిలోనూ సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు.