జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ ప్రాంతం.. సమయం శుక్రవారం ఉదయం 10.22 గంటలు.. ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు మైనరు బాలురు..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రౌతు ఈశ్వరరావు, ఎస్.శ్రీహరిలు బండిని ఆపారు. కానిస్టేబుళ్లు పక్కకు తీసుకెళ్లగానే బాలురు నోటి వెంబడి వచ్చిన ఒకే మాట చివరి వరకూ కొనసాగింది.. ‘‘మాకేం తెలియదు..ఈ ఒక్కసారికి వదిలేయండి..!’’
కానిస్టేబుల్: ఏం చదువుతున్నారు.. ?
బండి నడిపిన బాలుడు : సర్.. నేను ఐటీఐ చదువుతున్నాను..
మిగతా బాలురు : నేను, వీడు ఇంటర్ చదువుతున్నాం..
కానిస్టేబుల్ : ఏ ఊరు..? ఇటేం వచ్చారు..?
బాలురు : ఖాజీపేట అండి. సెలవు కదా అని దుస్తులు కొనేందుకు వచ్చేశాం.
బండి ఎవరిది : మా నాన్నది అండి.. గొర్రెలు మేపేందుకు వెళ్లిపోయాడు. తెలియకుండా తెచ్చేశా..
కానిస్టేబుల్ : మరి మీరు చిన్నోళ్లు కదా.. ఎవరైనా మీ బండిని ఢీకొట్టినా.. మీరు ఢీకొట్టినా చాలా ప్రమాదం కదా.. ఈ విషయం మీకు తెలియదా..!
బాలురు : మాకేం తెలియదండి.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్..
తక్షణమే కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ స్టేషన్కు తరలించేసి బాలురును ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ రామారావు మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, ఇచ్చే వాహన యజమానికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని చెప్పారు.
-శ్రీకాకుళం


