ఏఐ ఆధారిత ఈ–క్రాప్‌ అట! | Technical problems plaguing crop registration | Sakshi
Sakshi News home page

ఏఐ ఆధారిత ఈ–క్రాప్‌ అట!

Jul 3 2026 4:19 AM | Updated on Jul 3 2026 4:19 AM

Technical problems plaguing crop registration

ఇకపై ఇంకెన్ని కష్టాలో..

పంటల నమోదులో వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు 

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్‌ పాలనలో ఈ–క్రాప్‌ నమోదు మొక్కుబడి తంతుగా మారింది. నమోదులో జరుగుతున్న జాప్యం.. రైతుల పాలిట శాపంగా మారుతోంది. సాగు చేసిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోవడం, వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ పథకాలు పొందడంలో కీలకమైన ఈ–క్రాప్‌ నమోదును రాష్ట్ర ప్రభుత్వం ఏటా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. జూన్‌ 1నుంచి సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ–పంట నమోదు పూర్తి చేయాల్సి ఉంది. 

జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయినా ఇప్పటివరకు ఒక్క ఎకరా కూడా ఈ–క్రాప్‌ నమోదు కాలేదు. యాప్‌లో ఏటా కొత్త ఫీచర్స్‌ తీసుకొస్తున్న వ్యవసాయ శాఖ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో చతికిలపడుతోంది.  

నిబంధనలు పేరిట ఆంక్షలు 
జాతీయ స్థాయిలో డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో అనుసంధానించిన యాప్‌ ద్వారా నూరు శాతం పంట వివరాలు నమోదు చేయాలనే మార్గదర్శకాలు క్షేత్రస్థాయి సిబ్బందికి అశనిపాతాలుగా మా­రాయి. 2026–27 వ్యవసాయ సీజన్‌లో ఈ–క్రాప్‌ సర్వేకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం వెబ్‌ల్యాండ్‌లోని రైతువారీ ఖాతాలు, సీసీఆర్సీ డేటా, ఆర్‌వోఎఫ్‌ఆర్, డేటా, ఈ–ఫిష్‌ డేటా ఆధారంగా ల్యాండ్‌ పార్సిల్స్‌ను నమోదు చేయాలి. 

ప్రభుత్వ, లీజు, ఇతర అభ్యంతరకర భూముల్లో సాగుచేసే పంటల వివరాలను కూడా నమోదు చేయాలి.సర్వే నంబర్ల వారీగా పంటసాగులో ఉన్న భూములతోపాటు సాగులో లేని భూములు, ఆక్వా సాగు, బీడు, వ్యవసాయేతర భూ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. 0.25 ఎకరాల కంటే తక్కువ భూముల్లో పంటల వివరాలను సైతం నమోదు చేయాల్సిందే.

 పంట ఉన్నా లేకపోయినా భూ కమతాల వివరాలు నమోదు చేయాల్సిందే. గతేడాది నమోదైన అరటి, కొబ్బరి, మామిడి వంటి బహు వార్షిక ఉద్యాన పంటలతో పాటు పొలం గట్లపై ఉండే చెట్లు, ఇతర పంటల వివరాల నమోదును తప్పనిసరి చేశారు. 20 మీటర్ల పరిధిలో జియో ఫెన్సింగ్‌తో ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. పరిష్కారం కాని, సర్వే పూర్తికాని గ్రామాలు, అభ్యంతరకరమైన ల్యాండ్‌ పార్శి­ల్స్‌­లో పంట వివరాల నమోదు విషయంలో పూర్తి బాధ్యత­ను ఎంఏవో, తహసీల్దార్, డీఏవోలకు అప్పగించారు. 

తొలిసారి ఏఐ ఆధారిత ఇమేజ్‌ ప్రొసెసింగ్‌ 
ఈసారి 100 శాతం ఫొటో ధ్రువీకరణ కోసం కృత్రిమ ఆధారిత ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. మూడు దశల్లో ఎస్‌ఎంఎస్‌ ద్వారా రైతులకు తెలియజేయడంతోపాటు రైతుల ఈ–కేవైసీ ధ్రువీకరణ చేయాలని నిర్ణయించారు. పంట సాగుదారుల హక్కు పత్రాల(సీసీఆర్సీ) ఆధారంగానే కౌలు రైతులు సాగు చేసిన పంట వివరాలను నమోదు చేస్తారు. రైతులకు సొంతంగా ఈ పంట నమోదుకు అవకాశం కల్పించారు. అయితే ఈ–కేవైసీ నమోదు బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు.  సీసీఆర్సీ కార్డుల ఆధారంగానే కౌలు రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేయాలనే నిబంధన విధించారు.  

ఆర్బీకే సిబ్బందిపై పనిఒత్తిడి 
షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 1నుంచి ప్రారంభించి సెపె్టంబర్‌ 15వ తేదీలోగా ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదు పూర్తి చేయాలి. అక్టోబర్‌ 1 నుంచి 8వ తేదీ వరకు సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో ఈ–క్రాప్‌ జాబితాలను ప్రదర్శించి గ్రామసభలు నిర్వహించాలి. 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్‌ 15న తుది జాబితాను ప్రదర్శించాలి. వీఏఏ, వీఆర్‌ఏ, సర్వేయర్లతో కూడిన సంయుక్త అజమాయిషీ కింద నమోదు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ పనిభారాన్ని పూర్తిగా ఆర్బీకేలలో పనిచేసే వీఏఏలపైనే నెడుతున్నారు. ఓ వైపు విత్తనాలు, ఎరువులు, సర్వేలు అంటూ తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న వీ­ఏఏలకు ఈ–క్రాప్‌ నమోదు భారంగా మారుతోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement