
విద్యుత్ వినియోగదారులపై అదనపు లోడ్, వినియోగ చార్జీలు
నెల రోజుల్లో చెల్లించకపోతే సర్విసు తొలగిస్తామని హెచ్చరిక
ఇప్పటికే రూ.15,485 కోట్ల భారాన్ని మోస్తున్న రాష్ట్ర ప్రజలు
ఇప్పుడు లోడ్ క్రమబద్ధికరణ పేరుతో కూటమి మరో దోపిడీ
విజయవాడ నగరంలో స్క్యూ బ్రిడ్జి సమీపంలో నివసించే లక్ష్మికి ఏపీ సీపీడీసీఎల్ నుంచి ఈ నెల విద్యుత్ బిల్లుతో పాటు అదనపు వినియోగానికి సెక్యూరిటీ డిపాజిట్ (అడిషనల్ కన్జంప్షన్) చెల్లించాలంటూ ఓ నోటీసు వచ్చింది. అది చూసిన లక్ష్మికి గుండె ఆగినంత పనైంది. ఆమె విద్యుత్ సర్వీసు తీసుకున్నప్పుడు రెండు నెలలకు అడ్వాన్స్గా రూ.1,600 చెల్లించారు.
కానీ.. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకూ వినియోగించిన విద్యుత్ ఆధారంగా రూ.15,132 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉందని, అందులో రూ.1,600 పోనూ మిగిలిన రూ.13,532ను 30 రోజుల్లోగా చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఇప్పటికిప్పుడు అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో తెలియక, ఇదెక్కడి అన్యాయం బాబూ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
‘విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. మీ విద్యుత్ సర్వీసు లోడ్ క్రమబద్ధీకరణకు చక్కటి అవకాశం వచ్చింది. చెల్లించాల్సిన డిపాజిట్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. త్వరపడండి. ఈ అవకాశం కొంతకాలం మాత్రమే’ అంటూ ఇటీవల డిస్కంలు అరకొర ప్రకటనలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. క్రమబద్ధికరణ పేరుతో రాష్ట్ర ప్రజల నుంచి డిస్కంలు అడ్డదారిలో మరో దోపిడీకి పాల్పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఏమార్చి, విద్యుత్ వినియోగదారులను మోసం చేసి, రాయితీ పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే రూ.15,485 కోట్ల అదనపు చార్జీల భారంతో విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయి. వాడిన దానికి మించి వాడని విద్యుత్కు కూడా అకారణంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు.
అది చాలదన్నట్టు ఇప్పుడు లోడ్ క్రమబద్ధికరణ, అదనపు వినియోగ సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో నోటీసులు జారీ చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యుత్ బిల్లుతో పాటు వస్తున్న ఈ నోటీసులను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. – సాక్షి, అమరావతి
ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?
విద్యుత్ సర్వీసు తీసుకునే సమయంలో అధికారులు గతంలో గృహంలో ఉన్న పరికరాల ఆధారంగా కనెక్టెడ్ లోడ్ను అంచనా వేసి కాంట్రాక్టెడ్ లోడ్ను నిర్ణయించేవారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లులో కనెక్టెడ్ లోడ్, కాంట్రాక్టెడ్ లోడ్ వివరాలను చేర్చి, వినియోగదారులు తమ లోడ్ను క్రమబద్ధికరించుకోవాలని సూచిస్తున్నారు. కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ వినియోగం ఉంటే.. అదనపు లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తున్నారు. అందులో భాగంగా కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువగా వినియోగం ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసుల్లో అదనపు లోడ్ చార్జీలను చెల్లించాలని లేదా లోడ్ను క్రమబద్ధికరించాలని చెబుతున్నారు.
జూన్ 30లోగా క్రమబద్ధీకరించుకునే వారికి 50 శాతం రాయితీ ఇస్తామని ఏపీఈఆర్సీ ద్వారా ఓ ఆఫర్ను కూడా తీసుకొచ్చారు. దానిని ముందు పెట్టి అవసరమైన వాళ్లకు, అవసరం లేని వాళ్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కట్టకపోతే పూర్తి మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ఈ కొత్త చార్జీలు వినియోగదారులకు, ముఖ్యంగా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ లేని చార్జీలు ఇప్పుడు ఆకస్మికంగా విధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అసలేమిటీ లోడ్
విద్యుత్ లోడ్ భారం అనేది ఒక గృహం, సంస్థలో విద్యుత్ వినియోగానికి అవసరమైన మొత్తం విద్యుత్ అవసరాన్ని సూచిస్తుంది. దీనిని సాధారణంగా కిలోవాట్లలో కొలుస్తారు. ఈ లోడ్ రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి కనెక్టెడ్ లోడ్. అంటే.. ఒక విద్యుత్ సర్విసుకు అనుసంధానంగా ఉన్న ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, టీవీలు వంటి అన్ని పరికరాల మొత్తం విద్యుత్ సామర్థ్యం. రెండవది కాంట్రాక్టెడ్ లోడ్.. అంటే విద్యుత్ సరఫరా సంస్థతో వినియోగదారుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం అనుమతించిన గరిష్ట లోడ్. ఉదాహరణకు 2 కిలోవాట్ల కాంట్రాక్టెడ్ లోడ్ను ఎంచుకుని అంతకు మించి వినియోగం ఉంటే అదనపు చార్జీలుగానీ, జరిమానా గానీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే గృహ విద్యుత్ వినియోగంలో చాలామంది సామాన్య, పేద కుటుంబాలు కేవలం ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి సాధారణ విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగిస్తాయి. వాటి లోడ్ అధికంగా ఉండకపోయినా అదనంగా కట్టాలనడం వల్ల వారిపై ఆరి్థక భారం పడుతుంది. గృహ వినియోగదారులు కిలోవాట్కు రూ.2,000 అదనపు లోడ్ చార్జీ, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ లెక్కన 5 కిలోవాట్లకు నోటీసు ఇస్తే రూ.11 వేలు చెల్లించాలి. ఇందులో లోడ్ చార్జీలపై సగం రాయితీ ఇస్తే రూ.5 వేలు తగ్గుతుంది. మిగతా రూ.6 వేలు నెల రోజుల్లోపు చెల్లించకపోతే సర్వీసు తొలగించి సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ హెచ్చరిస్తోంది.