సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా.. 8 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. రేపటి నుండి 10వ తేదీ వరకు కస్టడీ ఇచ్చిన న్యాయస్థానం.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. రాజమండ్రిలో సిట్ విచారణ చేయనుంది.
సాయికృష్ణ మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. జూలై 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది. సమాచారం తెలిసిన వారు హాజరై తమ వద్ద ఉన్న సాక్ష్యాలు సమర్పించాలంటూ విజయవాడ ఆర్డీవో ప్రకటన విడుదల చేశారు.


