కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో నేడు కొన్ని జిల్లాల్లో వానలు
విపత్తుల నిర్వహణ సంస్థమేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు ఎండ ప్రభావం మరోవైపు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 79 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని పేర్కొన్నారు.
శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని చెప్పారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించారు.


