108 కుయ్యో మొర్రో! | Setback in service delivery under Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

108 కుయ్యో మొర్రో!

Jun 15 2026 2:12 AM | Updated on Jun 15 2026 2:12 AM

Setback in service delivery under Chandrababu Naidu government

ఆపదలో ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌లు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి

ప్రాణాలు పోతున్నా ఘటన స్థలికి చేరుకోని వైనం

అక్కడక్కడ సమయానికి వచ్చినా మధ్యలోనే మొరాయింపు

చంద్రబాబు సర్కారులో సేవల కల్పనలో తిరోగమనం

గత ప్రభుత్వంలో రోజుకు 3 వేల సేవలు.. ఇప్పుడు రోజుకు 1,500 

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న ఏడు నెలల గర్భిణి. మే 15న చిత్తూరు ప్రభుత్వా­స్పత్రిలో 800 గ్రాముల శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించాలని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లో పసికందును వెంటిలేటర్‌పై ఉంచి తిరుపతికి బయలుదేరారు. మురకంబట్టు దగ్గర అంబులెన్స్‌ ఉన్నట్టుండి ఆగిపో­యింది. వెంటిలేటర్‌పై ఉన్న శిశువుతో రెండు గంటల పాటు నడిరోడ్డుపై కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు. 60 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నుంచి మరో అంబులెన్స్‌ రప్పించి తిరుపతికి తరలించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దుస్థితి ఇది.

మే 2వ తేదీన ప్రకాశం జిల్లా రాయివారిపాలెంకు చెందిన కట్టా శంకరమ్మ ఇంటి వద్ద స్పహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌ సాయం కోరారు. 10.. 20.. 30.. నిమిషాలు గడిచినా అంబులెన్స్‌ రాలేదు. మళ్లీ 108కు ఫోన్‌ చేయగా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందంటూ ఏకంగా గంటన్నర ఆలస్యం చేశారు. చివరకు అంబులెన్స్‌ గ్రామానికి చేరుకునే సరికే శంకరమ్మ తుది శ్వాస విడిచారు. అంబులెన్స్‌ సకాలంలో వచ్చి ఉంటే శంకరమ్మ బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

సాక్షి, అమరావతి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్వీర్యమైన 108 అంబులెన్స్‌ సేవలను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. ఇక్కడ ఉదహరించిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక 108, 104 సేవలను అవకతవకలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. టీడీపీ నేతకు చెందిన ‘భవ్య’ అనే సంస్థకు అడ్డదారుల్లో 104, 108 నిర్వహణ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టేశారు. 

అస్మదీయులకు నిర్వహణ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడంపై చూపిన శ్రద్ధ.. పకడ్బందీగా సేవలు అమలు చేయడంపై పెట్టలేదు. దీంతో రోడ్డు.. ఇతర ప్రమాదాలు, అనారోగ్య బాధితులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన అంబులెన్స్‌లు సకాలంలో స్పందించడం లేదు. నిర్వహణ సరిగా లేక అంబులెన్స్‌లు మొరాయించడం, ఆపద సమయంలో ఫోన్‌ చేస్తే సకాలంలో ఘటనా స్థలికి చేరుకోకపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉండగా, అందులో 731 ఆన్‌ రోడ్‌ సేవలు అందించాలి. మిగిలినవి బ్యాకప్‌ కింద ఉంటాయి. 

కాగా, రాష్ట్రంలో ఏ ఒక్క రోజు 731 వాహనాలు ఆన్‌ రోడ్‌ సేవల్లో ఉండటం లేదని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్‌లు రోజుకు సగటున మూడు వేల కేసులకు అటెండ్‌ అయ్యేవి. చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల మేర సేవలను అంబులెన్స్‌లు అందిస్తున్నాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే రోజువారీ వెయ్యికి పైగా సేవలు తగ్గిపోయాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో డయాలసిస్‌ చేయించుకోవాల్సిన కిడ్నీ వ్యాధి రోగులకు ఉచితంగా 108 అంబులెన్స్‌ సేవలు అందేవి. 

2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ సర్వీస్‌ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కిడ్నీ బాధితులు ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు ఒక ప్రభుత్వాస్పత్రి నుంచి మరో ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం రోగులను తరలించే సేవలు సైతం పడిపోయాయి. రోగులను తరలించాలని వైద్యులు రెఫర్‌ చేసినప్పటికీ, ఎమర్జెన్సీ కేసు కాదని నిర్వహణ సంస్థ తిరస్కరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆపద సమయంలో నిర్ధేశిత సమయం కంటే ఆలస్యంగా అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి. ఫలితంగా అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 

సమయానికి వచ్చి ఉంటే ఒట్టు!
మార్చి 29న శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్‌ చేశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ ఎక్కించిన కాసేపటికి అది మొరాయించింది. పోలీసులు, స్థానికులు తలా ఓ చేయి వేసి ఎంత నెట్టినా ఇంజిన్‌ స్టార్ట్‌ అవ్వలేదు. 20 నిమిషాల పాటు అష్టకష్టాలు పడ్డాక ఇంజిన్‌ స్టార్ట్‌ అయింది. చికిత్స ఆలస్యం అవ్వడంతో క్షతగాత్రులు విలవిల్లాడిపోయారు.  

» మూడు నెలల కిందట కాకినాడ జిల్లా సర్పవరం సమీపంలో రాత్రి సమయంలో ఓ టిప్పర్‌ కారును ఢీ కొట్టింది. కారులో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళను ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108 అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌లు అందుబాటులో లేవని కాల్‌ సెంటర్‌ సిబ్బంది సమాధానం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహిళ విలవిల్లాడుతూ కొద్దిసేపటికే మరణించింది. కాకినాడ నగరానికి కూత వేటు దూరానికి అంబులెన్స్‌ను పంపక పోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

» మార్చి 26 తెల్లవారుజామున మార్కాపురం వద్ద ప్రైవేట్‌ బస్సు నడిరోడ్డుపై దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్‌ చేశారు. 20 సార్లు ఫోన్‌ చేసినా కనీస స్పందన లేదని ప్రమాదానికి గురైన బస్సులోని యువతి కన్నీరుమున్నీరైంది.

» గతేడాది మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం 108కు డయల్‌ చేసినా కాల్స్‌ కలవలేదు. ఏకంగా ఐదు గంటలకు పైగా సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైన వారికి సత్వరమే వైద్య సేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. పలువురు ఏకంగా మత్యువాత పడ్డారు.

నాడు ఏడాదిలో బలోపేతం
గతంలో చంద్రబాబు 108 వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చగా, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో ఈ వ్యవస్థను బలోపేతం చేశారు. 2019కి ముందు 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. కనీసం మండలానికి ఒక అంబులెన్స్‌ కూడా లేని దుస్థితి. అత్యవసర వైద్య సేవల సంస్కరణల్లో భాగంగా మండలానికి రెండు అంబులెన్స్‌లు సమకూరుస్తూ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

ఈ క్రమంలో ఏడాది తిరక్కుండానే 412 అంబులెన్స్‌లు కొనుగోలు చేశారు. వీటిని 2020 జూలై1న వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. 26 నియోనాటల్‌ అంబులెన్స్‌ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందు కోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో అదనంగా మరో 20 కొత్త 108 అంబులెన్స్‌లను గిరిజన ప్రాంతాలకు సమకూర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అత్యవసర వేళ అండగా నిలిచారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement