ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా! | Secretariat employees protest at the corporation office | Sakshi
Sakshi News home page

ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!

May 31 2025 4:17 AM | Updated on May 31 2025 4:17 AM

Secretariat employees protest at the corporation office

సచివాలయ ఉద్యోగిపై అనంతపురం టీడీపీ నేత పచ్చిబూతులు

మహానాడుకు జనాన్ని తరలించలేదని ఫోనులో నోటికొచ్చినట్లు అసభ్య పదజాలం

కార్పొరేషన్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల ధర్నా

పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌

టీడీపీ నేత వైఖరిని ఖండించిన మేయర్, వామపక్షాలు 

ఇటీవలే మేయర్‌ చాంబర్‌లోనూ పచ్చమూకల దౌర్జన్యం

అనంతపురం కార్పొరేషన్‌: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్‌ వసీం చాంబర్‌లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి రాజేష్‌నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. 

మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్‌ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం ఇచ్చారు.

నేను మాట్లాడేది రికార్డు చెయ్‌..
కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్‌నాయుడు ఫోన్‌లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్‌ అన్నా.. రాత్రి నుంచి ఫోన్‌చేసినా.. నీ క్లస్టర్‌ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్‌ రికార్డు చెయ్‌ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్‌..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.

పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..
ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్‌ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా  ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది మంచి సంస్కృతి కాదు..
సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్‌నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు.  – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శి

రాజేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలి..
టీడీపీ నేత రాజేష్‌నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్‌కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్‌. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

కూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..
టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్‌లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement