అగ్రి గోల్డ్‌ బాధితులకు 24న రెండోదశ చెల్లింపులు

Second installment payments to Agri Gold victims on 24th August - Sakshi

రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు నగదు చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే రూ.10 వేలలోపు సొమ్మును డిపాజిట్‌ చేసిన వారికి ప్రభుత్వం ఆ మొత్తాలను చెల్లించింది. తాజాగా రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను ఈ నెల 24న జమ చేయనున్నారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు కట్టిన డిపాజిట్‌దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్, రశీదులు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వలంటీర్‌ వద్ద నమోదు చేయించుకోవాలని సీఐడీ విభాగం బుధవారం ఓ ప్రకటనలో కోరింది. సంబంధిత వివరాలను ఈ నెల 6 నుంచి 12లోగా గ్రామ/వార్డు వలంటీర్‌ ద్వారా నమోదు చేయించుకోవాలి. 

విధి విధానాలు ఇవీ..
► కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.
► డిపాజిట్‌దారులకు రావాల్సిన నగదును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సమ్మతించరు.
► ఒక డిపాజిట్‌దారు ఒక క్లెయిమ్‌కే అర్హులు.
► చనిపోయిన డిపాజిట్‌దారుల డిపాజిట్‌ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలి.
► గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు. ఒక్కసారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలి.
► సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–425–3875లో సంప్రదించాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top