శివప్రసాద్‌ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం: సజ్జల | Sakshi
Sakshi News home page

శివప్రసాద్‌ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం: సజ్జల

Published Wed, Sep 8 2021 3:22 PM

Sajjala Ramakrishna Reddy Comments At YSRCP MLA Siva Prasad Reddy Raithu Sabha - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా:  ప్రొద్టుటూరులోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంక్షేమం అందించేందుకు ఆర్‌బీకే కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు స్వయంగా తమ కాళ్లపై నిలబడేలా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన’’ అని తెలిపారు.

‘‘ఎంత త్వరగా రైతులను ఆదుకుంటున్నాము అనేదే ఇక్కడ ముఖ్యం.. పంటల బీమా, పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వడం ద్వారా రైతులకు వడ్డీ భారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి ఐదేళ్లలో కూడా పూర్తిగా చెల్లించలేదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీని పూర్తి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయం. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొంటున్నాయి’’ అని సజ్జల తెలిపారు. (చదవండి: రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి)

‘‘స్వచ్ఛమైన ఆలోచన, అన్ని వర్గాలను తన కుటుంబాల లాగా భావించి కార్యక్రమాలు అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన. గ్రామాల్లో ఆర్‌బీకేల్లో మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా స్థానిక నేతలు సహకారం కావాలి. సహకార రంగం మరింత బలోపేతం కావాలంటే గ్రామాల్లో నేతలు కలిసి పనిచేయాలి. జిల్లాకు నీరు వస్తుందా రాదా అన్న కల నుంచి ఇప్పుడు 60 టీఎంసీల నీరు నిల్వ చేసే స్థాయికి వెళ్లడం వైఎస్ కుటుంబం చలువ. వరద జలాలు కిందికి వృధాగా వెళ్లకుండా నీటిని ఒడిసిపట్టి నీటిని నిల్వ చేసుకుంటున్నాం’’ అన్నారు సజ్జల.

చదవండి: పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే..

Advertisement

తప్పక చదవండి

Advertisement