
ఐదుగురు నిందితులు అరెస్టు
విజయనగరం క్రైమ్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాలోని ఐదుగురు సభ్యులను విజయనగరం వన్టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కథనం ప్రకారం విజయనగరంలోని ప్రదీప్నగర్కు చెందిన నిందితుడు కె.సాయివెంకట్ సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తన ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు.
దీన్ని చూసిన పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు ఆయనను సంప్రదించారు. వారి నుంచి రూ.53 లక్షలు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసి విజయవాడలో నెల రోజులు ఉంచాడు. తరువాత సమాచారం వస్తుందని అప్పుడు విధుల్లో చేరవచ్చని వెనక్కి పంపేశాడు. ఎంతకీ సమాచారం రాకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వినోద్ పోలీసులను ఆశ్రయించాడు.
వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి శనివారం సుజిత్తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. వారి నుంచి రూ.6లక్షలు స్వా«దీనం చేసుకున్నారు.