
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. కాకాణికి రిమాండ్ విధిస్తూ మేజి్రస్టేట్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. పిటిషనర్పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే ప్రాథమిక, ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే మేజిస్ట్రేట్ యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ అక్రమ కేసు...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ అల్లీపురంకి చెందిన టీడీపీ నేత మేకల సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ పోలీసులు కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయడంతో పాటు గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తన మీద జారీ చేసిన పీటీ వారెంట్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.
మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు..
కాకాణి గోవర్ధన్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. పీటీ వారెంట్ కూడా సరైన ఫార్మాట్లో లేదన్నారు. కాకాణికి రిమాండ్ విధించే సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పాటించలేదన్నారు. కాకాణిపై పెట్టిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మేజి్రస్టేట్ కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మనోహర్రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు.. పిటిషనర్ కాకాణి గోవర్ధన్రెడ్డిపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
