
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ఉత్తర–దక్షిణ ద్రోణి బలహీనపడింది. మరోవైపు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో అనేకచోట్ల, ఆదివారం కొన్నిచోట్ల, రాయలసీమలో శని, ఆదివారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది.
కాగా.. శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వెలివాడలో 9.8 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 8.5, సంతబొమ్మాళిలో 7.9, గరికిపాలెంలో 7.1, తులుగులో 6.8, ఎచ్చెర్లలో 6.3, గొట్టా బ్యారేజి (శ్రీకాకుళం) వద్ద 6.1, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 6.2, విజయనగరంలో 5.3, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 4.6, ఆనందపురంలో 4.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.