తీవ్ర వాయుగుండం ప్రభావం
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో కొనసాగుతోందని వెల్లడించింది.
ఇది బాలాసోర్–కానింగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


