సాక్షి,అమరావతి: ముద్రగడ సంతాప సభకు హాజరైనందుకు బోండా ఉమాను వివరణ కోరడాన్ని కాపు పోరాట రిజర్వేషన్ పోరాట సమితి ఖండించింది. కాపులంటే మీకెందుకు అంత లోకువా అని చంద్రబాబును ప్రశ్నించింది. ఈ అంశమై చంద్రబాబును ప్రశ్నిస్తూ ఈ రోజు ( సోమవారం) చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసింది. సంతాపసభల్లో పాల్గొనవద్దనడం సరికాదని సంతాప సభలకు వెళ్లే స్వేచ్ఛ కూడా కాపులకు లేదా అని ప్రశ్నించింది.
కేఆర్పీఎస్ లేఖలో.. ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రక్షణ ఏది, కనీసం సంతాప సభలకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, కాపులను వేదికలు పంచుకోవద్దని నియంత్రించడం సరికాదు. కాపులు, బీసిలంటే మీకు లోకువా కృష్ణాజిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని బోండా ఉమాతో మీరు పోరాటం చేయించలేదా.. మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది ఎందుకు రంగా పేరు జిల్లాకు పెట్టలేదని లేఖలో ప్రశ్నించింది.
దివంగత కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను మీరు ఎన్ని రకాలుగా వేధించారో అందరికీ తెలుసని ఆయన చనిపోయాక కూడా మీ కక్ష సాధింపు ఆపడం లేదని తెలిపింది. కాపులేమైనా మీకు బానిసలా? సంతాప సభల్లో కాపులు కలవకూడదా ఆంధ్రప్రదేశ్లో నిత్యం కుల రాజకీయాలు చేస్తూ కులాలను రోడ్డెక్కిస్తున్నారు. కాపులకు 12% రిజర్వేషన్లు కల్పించడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏంటి కాపులకు మీరేం చేశారో మీడియా వేదికగా బహిరంగ చర్చకు మేం సిద్ధమని కేఆర్పీఎస్ లేఖలో చంద్రబాబుకు సవాల్ విసిరింది.


