
అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం: ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని సమాధి నుంచి బయటకు తీసుకొచ్చిన ఘటన తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
విఠలాపురంలో స్థానిక భూదేవి ఆలయం వద్ద కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి తాను సజీవ సమాధి అవుతున్నానని చెప్పి అందుకు ఏర్పాట్లు చేసుకుని గుంత తవ్వి అందులోకి దిగి పైన రేకు వేసేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ఎందుకు ఇలా చేస్తున్నావని గ్రామస్తులు అడిగితే ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని, కులమతాలు లేకుండా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటూ నేను దీక్ష తీసుకొని సజీవ సమాధి అవుతున్నానని చెప్పాడు. ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని లోపలి నుంచి బయటికి తీసి ఇకపై ఇటువంటి పనులు మళ్లీ చేయవద్దంటూ హెచ్చరించారు. ఇదంతా ప్రచారం కోసం చేసిన ప్రయత్నమని ఎస్సై మల్లికార్జునరావు తెలిపారు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడు.