దేశమంతా మనవైపే | Sakshi
Sakshi News home page

దేశమంతా మనవైపే

Published Tue, Apr 13 2021 4:11 AM

Praise from celebrities, including the PM for the volunteer system - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలను ఇప్పుడు దేశం మొత్తం అనుసరించే పరిస్థితి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ ప్రధానితో సహా దేశంలో అందరి ప్రశంసలు పొందిందని చెప్పారు. సోమవారం పోరంకిలో జరిగిన వలంటీర్ల సత్కారాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు వారి ఎమ్మెల్యే పేరు తెలుసో లేదో కానీ వలంటీరు పేరు, ఫోను నంబరు మాత్రం కచ్చితంగా తెలిసేలా ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పారు. సీఎం జగన్‌ కొత్త వ్యవస్థలను సృష్టించి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేరువ చేశారని ఎమ్మెల్యే కె.పార్థ్ధసారథి పేర్కొన్నారు. 

ఏ బాధ్యత ఇచ్చినా మీ వెంటే.. 
నా 50 కుటుంబాల  పరిధిలో 89 ఏళ్ల అవ్వ ఉంది. గతంలో ప్రతి నెలా ఇంటి నుంచి ఆటోలో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి పింఛన్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. వలంటీర్ల వ్యవస్థ వచ్చాక ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయం కంటే ముందే  ఇంటికి వెళ్లి చేతికి పింఛను డబ్బులు అందచేస్తున్నప్పుడు నా మనవడివి అంటూ చూపే ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేనిది. అలాంటి ఆనందాన్ని ఇచ్చిన సీఎం గారికి ధన్యవాదాలు. మీరే మరో 40 ఏళ్లు సీఎం. మీరు ఏ బాధ్యత ఇచ్చినా మీతోనే నడుస్తాం.   
–బి.వరసతీష్,  వలంటీరు, యనమలకుదురు

కన్నబిడ్డలా చూసుకుంటున్నారు
ఉదయం పింఛను డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండగా ముందు రోజు రాత్రి 12 గంటలకు నాకు ఓ ఫోను కాల్‌ వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నానని లబ్ధిదారుడు చెప్పడంతో మా అన్నయ్యతో కలిసి అక్కడకు వెళ్లి పింఛను డబ్బులిచ్చినప్పుడు ఆ కుటుంబం చూపిన ఆప్యాయతను మరువలేను. గతంలో రేషన్‌కార్డు కోసం ఐదేళ్ల పాటు తిరిగి వేసారిన ఓ కుటుంబానికి ఇప్పుడు 2 గంటల్లోనే కార్డు అందించడంతో ఎంతో సంతోషించింది. మా ద్వారా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలని ఆ కుటుంబం కోరింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తుంటే చాలా కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. నా క్లస్టర్‌లో ప్రతి కుటుంబం నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తోంది. పండుగకు నాకు దుస్తులు కూడా బహూకరించారు. దీనికి కారణమైన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.  
 –కె.సుష్మ, వలంటీరు. 

Advertisement
Advertisement