ఇసుక స్టాక్‌ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం | Police officer insulted in the name of caste | Sakshi
Sakshi News home page

ఇసుక స్టాక్‌ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం

Aug 19 2024 5:50 AM | Updated on Aug 19 2024 5:50 AM

Police officer insulted in the name of caste

ట్రాక్టర్‌ డ్రైవర్లను కులం పేరుతో పచ్చి బూతులు దూషించిన పోలీసు అధికారి 

వే బిల్లులు ఇచ్చిన అధికారులను వదిలి ట్రాక్టరు డ్రైవర్‌పై ప్రతాపం 

 మీ సినిమా అయిపోయిందంటూ నోటికొచ్చినట్లు మాటలు 

గుంటూరు టాస్‌్కఫోర్స్‌:  గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక స్టాక్‌ యార్డులో తుళ్లూరు సీఐ ఆగడాలు మితిమీరుతున్నాయని, అకారణంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీరంగం వేస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నోటితో చెప్పలేని రీతిలో బండ బూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. శనివారం సాయంత్రం ఇసుక లోడింగ్‌ చేసుకుంటుండగా ఆ సీఐ వచ్చి.. రికార్డులు పరిశీలించి లోడింగ్‌ జరుగుతున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ను కిందకు దించి ‘నీకిది మూడో ట్రిప్పు.. నువ్వెందుకు వచ్చావురా? నీ ఊరేది, నీ కులం ఏంటి రా..?’ అని గద్దించారు. 

డ్రైవర్‌ ఉద్దండరాయునిపాలెం అని బదులివ్వగానే.. మా.. లం..కో..ల్లారా.. అంటూ అతన్ని బిల్లులు రాసే దగ్గరకి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి వే బిల్లును లాక్కొని ట్రాక్టర్‌ను వే బ్రిడ్జి దగ్గర కాటా పెట్టించి స్టేషన్‌కు తీసుకురావాలని కానిస్టేబుల్‌కు చెప్పారు. నిజానికి.. లోకల్‌ ట్రాక్టర్‌ కావడం, ట్రాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతోపాటు స్థానిక గ్రామాల్లోనే ఇసుకను తోలుతుండటంవల్ల సదరు ట్రాక్టర్‌ ఆ రోజు క్యూలోనే మూడో ట్రిప్పు కింద వచ్చింది. 

అయితే, అసలు వే బిల్లులు ఇచ్చిన వారిని వదిలిపెట్టి తనను కావాలనే టార్గెట్‌ చేసి కులం పేరుతో దూషించి కొట్టాడని బాధితుడు ప్రసన్నకుమార్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించి వే బిల్లులు తీసుకుని ఇసుకను తీసుకెళ్తున్న దళితుడినైన తనపై సీఐ దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. స్టాక్‌ యార్డులో వేబ్రిడ్జి ఉండాల్సి ఉన్నప్పటికీ అవేమీ నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కేవలం జేసీబీ బొచ్చ ప్రామాణికంగా లోడింగ్‌ జరుగుతుంటే వాహనాలపై అధిక లోడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.   

మరో యువకుడిపైనా మాటల దాడి.. 
ఇక ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ అనే మరో ఎస్సీ యువకుడి లారీపై కూడా ఓవర్‌ లోడింగ్‌ కేసు నమోదు చేసిన సీఐ అతన్ని కూడా పిలిపించి.. రాయడానికి వీల్లేని భాష మాట్లాడుతూ.. ‘మా.. నా కొ.. నీ మీద తొమ్మిది కేసులున్నాయి.. ఇంకోసారి కనపడితే నీ మీద రౌడీïÙట్‌ ఓపెన్‌ చేసి బొక్కలో వేస్తా నువ్వు ఊరు వదిలి పారిపోవాలి’.. అంటూ  ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధితుడు వాపో­యాడు. 

ఇలా ఉద్దండరాయునిపాలెం ఎస్సీ యువకులే టార్గెట్‌గా సీఐ బెదిరింపులు ఎక్కువయ్యాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పడిగాపులు కాసి ఒక్క ఇసుక ట్రాక్టరు తీసుకెళ్లి అన్‌లోడ్‌ చేస్తే యజమాని వద్ద నుంచి మాకు వచ్చేది రూ.300–రూ.400లేనని.. పోలీసులు ఇలా తమను టార్గెట్‌ చేస్తే బతికేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌.. 
ఇసుక తరలింపులో టీడీపీ నేతల వాహనాలను వదిలేసి వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలే టార్గెట్‌గా సీఐ వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అదే టీడీపీకి చెందిన వారి వాహనాలు కూడా ఎక్కువ ట్రిప్పులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నా తమనే టార్గెట్‌ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కులం పేరుతో తిట్టి కాళ్లతో తన్నాడు.. 
బిల్లు రాయించుకుని లోడింగ్‌ చేసుకునేందుకు వెళ్లిన నన్ను పిలిచి మాదిగ లం..కొ..ల్లారా అంటూ జుట్టు పట్టుకుని (రాయలేని భాషలో తిడుతూ) చెంపల మీద కొట్టి కిందపడేసి బూట్లతో కడుపులో గట్టిగా తన్ని ‘నా కొ.. ఉద్దండరాయునిపాలెం మా.. నా కొ.. ఊళ్లో ఒక్కడినీ ఉండనివ్వను’ అంటూ నానా మాటలన్నాడు.   – ప్రసన్నకుమార్, ట్రాక్టర్‌ డ్రైవర్‌  

రౌడ్‌షీట్‌ ఓపెన్‌ చేసి బొక్కలో.. 
నాపై గతంలో టీడీపీ వాళ్లు పెట్టిన కేసు విషయంలో స్టేష­న్‌కు పిలిపించి ఏ కులం అని అడిగి.. ‘మా.. నా కొ..  మీకు ఎక్కడవిరా ఈ లారీలు? నీ మీద 9 కేసులున్నాయి. ఇంకోసారి కనబడితే ‘నా కొ.. నీ మీద రౌడీïÙట్‌ ఓపెన్‌ చేస్తానంటూ చెప్పలేని మాటలతో దూషించాడు.  – నందిగం మణికంఠ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement