దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి | NTR District Mylavaram Incident | Sakshi
Sakshi News home page

దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి

Jun 22 2025 8:10 AM | Updated on Jun 22 2025 8:10 AM

NTR District Mylavaram Incident

భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను కడతేర్చిన రవిశంకర్‌

ఈ నెల 12న సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన

విశాఖపట్నంలో పోలీసులకు చిక్కిన నిందితుడు రవిశంకర్‌

మైలవరం(కృష్ణా): భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని చిన్నారులను పొట్టనబెట్టుకున్న తండ్రి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మైలవరంలోని మారుతీనగర్‌లో నివసించే వేములవాడ రవిశంకర్‌, చంద్రిక దంపతులకు కుమార్తె లక్ష్మీహిరణ్య(9), కుమారుడు లీలాసాయి నృసింహ (7) ఉన్నారు. వారిద్దరూ జి.కొండూరులోని ఓ వసతి గృహంలో ఉంటూ ఐదు, మూడో తరగతులు చదువుతున్నారు. 

రవిశంకర్‌, చంద్రక నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బహ్రెయిన్‌ వెళ్లింది. మొదటి నుంచి భార్య తీరుపై రవిశంకర్‌కు అనుమానం ఉంది. భార్య బహ్రెయిన్‌ వెళ్లినప్పటి నుంచి పిల్లలను చంపేందుకు రవిశంకర్‌ పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్‌ పుట్టిన రోజున పిల్లలు ఇద్దరిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. పథకం ప్రకారం ‘నీకు చాలా అన్యాయం చేశాను చంద్రిక’ అంటూ పిల్లలు ఇద్దరినీ చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. అనంతరం పిల్లలు ఇద్దరినీ హత్య చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

 ఆ తర్వాత ఈ నెల 12న రవిశంకర్‌ తండ్రి ఇంటికి వచ్చి చూడగా మనవడు, మనవరాలు బెడ్‌పై విగతజీవుల్లా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు రవిశంకర్‌ ఇంట్లో అతను చంద్రికకు రాసిన లేఖ దొరికింది. దీంతో రవిశంకర్‌ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. రవిశంకర్‌ ఫోన్‌ సిగ్నల్‌ చివరిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద లభించడంతో రెండు రోజులపాటు రవిశంకర్‌ ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కృష్ణానదిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ రవిశంకర్‌ ఆచూకీ లభించకపోవడంతో బతికే ఉంటాడని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా..
ఇద్దరు బిడ్డలను హత్య చేసిన అనంతరం రవిశంకర్‌ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకొని అక్కడి సిమ్‌తో పాటు సెల్‌ఫోన్‌ను పడేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కొత్తగా కొనుగోలు చేసిన సెల్‌ నుంచి మైలవరంలో ఒకరికి ఇటీవల ఫోన్‌ చేయడాన్ని పోలీసులు గుర్తించి, ఫోన్‌ సిగ్నల్‌ను ట్రాక్‌చేసి రవిశంకర్‌ ఆచూకీని కనిపెట్టారు. సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తలదాచుకున్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం తరలించి విచారణ చేపట్టారు. 

ఈ నెల ఎనిమిదో తేదీన రవిశంకర్‌ పుట్టినరోజు కావడంతో ఆ రోజు మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చి దానిలో పురుగుమందు కలిపి ఇద్దరు బిడ్డలకు బలవంతంగా తినిపించి, వారిద్దరూ స్పృహ కోల్పోయే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలిందని సమా చారం. నిందితుడిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement