కొంపముంచుతున్న కొత్త స్నేహాలు | New friendships are being formed through social media | Sakshi
Sakshi News home page

కొంపముంచుతున్న కొత్త స్నేహాలు

Jun 1 2025 5:19 AM | Updated on Jun 1 2025 9:36 AM

New friendships are being formed through social media

ఇన్‌స్టాలో చూపులు.. వాట్సాప్‌లో చాటింగ్‌ 

యువతను ముంచుతున్న సోషల్‌ మీడియా

సమస్యలతో పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కుతున్న మైనర్లు

సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్‌ స్టా గ్రామ్‌ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్‌ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్‌ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్‌ స్టేషన్‌లో వెలుగు చూస్తూనే ఉన్నాయి.  

ఎక్కువ మంది మైనర్లే.. 
తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్‌ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్‌లైన్‌ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్‌కు వస్తున్నాయి. 

అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్‌లైన్‌ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. 

నిబంధనలు బేఖాతరు.. 
సోషల్‌ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్‌ కావడం... అప్పటికే  పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. 

బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు.

పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్‌ చేసుకుంటూ వాట్సాప్‌ కాల్స్‌ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్‌.. ఫొటోల మారి్పడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. 

హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్‌ చేసుకుంటూ ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్‌ చాటింగ్‌ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. 

అవగాహన కల్పిస్తున్నాం  
మొబైల్‌ ఫోన్‌ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం తదితర సోషల్‌ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం.   – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement