60 ఏళ్లు దాటితేనే మోకాలి శస్త్రచికిత్స! | Knee surgery only after the age of 60 | Sakshi
Sakshi News home page

60 ఏళ్లు దాటితేనే మోకాలి శస్త్రచికిత్స!

Jun 16 2025 3:01 AM | Updated on Jun 16 2025 3:01 AM

Knee surgery only after the age of 60

యువతకు ఇది మంచిది కాదు

అందుకే ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద దీన్ని తొలగించారు

‘సాక్షి’తో డాక్టర్‌ ప్రత్మేష్‌ జైన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మంచిదని... యువతకు ఇది మంచిదికాదని అహ్మదాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ నీ అండ్‌ షోల్డర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్, చీఫ్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రత్మేష్‌ జైన్‌ తెలిపారు. 60 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ప్రధానంగా మోకాళ్లకు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (జాయింట్‌ రీ–ప్లెస్‌మెంట్‌ సర్జరీ) చేయడం కంటే... మోకా లిని సంరక్షించుకునే పద్ధతి మెరుగైనదని పేర్కొ న్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ యోజన పథకం కింద 60 ఏళ్ల లోపు వారికి జాయింట్‌ రీ–ప్లేస్‌మెంట్‌ సర్జరీలను చేయవద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చిందని  తెలిపారు. 

60 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి మోకాలి, తుంటి సంరక్షణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైర్‌లెస్‌ ఆర్థోస్కోపీ ద్వారా చేసే శస్త్రచికిత్సల వల్ల తక్కువ గాయం, రక్తస్రావంతో సర్జరీ చేసే వీలుందని,  అయితే, భారతదేశంలో ఇప్పటివరకు కేవలం కొచ్చిలో మాత్రమే ఈ పద్థతి ద్వారా చికిత్స చేసినట్లు తెలిపారు.  దీనిపై మరింతగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘అడ్వాన్స్‌డ్‌ నీ ఆర్థోస్కోపీ కోర్స్‌’సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...!

యువత విషయంలో ఇది బెటర్‌..
యువతకు గాయమైన సందర్భాల్లో మొత్తం మోకాలి మార్పిడికి పోకుండా పనితీరును పునరుద్ధరించడానికి ఉద్దే శించిన ఇతర పద్ధతులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది.  ఫిజియోథెరపీ, పెయిన్‌ రిలీఫ్, యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ మందులు, ఇంజెక్షన్లు వంటి వాటిని వినియోగించడం వంటి పద్ధతులపైనే ఆధారపడితే మంచిది. 

యూరప్‌కు ఎగుమతులు
గతంలో మనం ప్రధానంగా ఎముకలకు సంబంధించిన సర్జరీలకు, చికిత్సలకు అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన అవసరాలకు మనం ఉత్పత్తి చేసుకోవడంతో పాటు యూరప్‌ వంటి దేశాలకు కూడా మనం పరికరాలను ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికే మనం నూరుకుపైగా దేశాలకు ఆర్థోపెడిక్‌ ఉపకరణాలను మనం దేశం నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్‌లో చైనాది కూడా మన తర్వాతి స్థానమే. ప్రధానంగా మేకిన్‌ ఇండియాలో భాగంగా స్థానికంగా ఉత్పత్తి చేయడం పెరుగుతోంది. 

పెరుగుతున్న క్రీడాగాయాలు
మన దేశంలో క్రీడల ద్వారా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎముకల శస్త్రచికిత్సలు పెరుగు తున్నాయి. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో పాటు సరైన శిక్షణ లేకుండా ఆటలు ఆడటం కూడా ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌ విష యానికి వస్తే,  మిగిలిన ప్రాంతాల కంటే విశాఖ లో క్రీడాగాయాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇక్కడ సర్జరీలు కూడా ఎక్కువ. 

2036 సంవత్సరంలో అహ్మదాబాద్‌లో జరగనున్న ఒలంపిక్స్‌ నేపథ్యంలో ప్రధానంగా ఈ క్రీడా గాయాలపై ఎక్కువ దృష్టి సారించి... మెరుగైన వైద్యసేవలను అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సదస్సులు యువ డాక్టర్లకు మరింతగా అత్యాధునిక వైద్యపద్ధతులకు తెలియజేసేందుకు ఉపయోగపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement