ఆయనను రాజమండ్రి జైలులో విచారించడం సాధ్యం కాదు
పోలీసు కస్టడీపై విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సిట్
అత్యవసరమైనందున ఆదివారం విచారిస్తామన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఇచ్చిన పోలీసు కస్టడీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజును విచారించేందుకు అనుమతించాలని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం జైలులో విచారణకు సిట్ అభ్యంతరాలు ఇవీ..
నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, ‘నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలను సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కు దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరపకుండా అడ్డుకున్నట్లవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకెళ్లడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలి’’ అని విన్నవించారు.
మరకలు ఉన్న లాఠీ.. ఎముకలు.. బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాదీనం చేసుకున్నాం: హైకోర్టుకు సిట్ సంచలన విషయాలు
విజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ తన పిటిషన్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ‘సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా, చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతనిని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 01.05.2026 నుండి 01.06.2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు.
ఎల్రక్టానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాదీనం చేసుకున్నాం.. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.’ అని సిట్ తన పిటిషన్లో పేర్కొంది.
నాకు ప్రాణహాని ఉంది: నాగరాజు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ప్రధాని నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. నాగరాజును ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు సిట్కు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయవాడ కోర్టుకు ఈ లేఖ రాశారు.
తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలని, సిట్ టార్చర్ లేకుండా చూడాలని కోరారు. నాగరాజును రాజమహేంద్రవరంలో విచారించడంసహా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణ కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఆయన విచారణ ప్రక్రియ నిలిచిపోయింది.


