బాబు అరాచకం.. సిట్‌ గూండాయిజం | Investigation into illegal liquor case under Chandrababu direction | Sakshi
Sakshi News home page

బాబు అరాచకం.. సిట్‌ గూండాయిజం

Jun 18 2025 4:56 AM | Updated on Jun 18 2025 8:52 AM

Investigation into illegal liquor case under Chandrababu direction

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు

ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కూడా అక్రమ కేసు

చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లుక్‌ అవుట్‌ నోటీసు 

బెంగళూరు విమానాశ్రయంలో అక్రమంగా అదుపులోకి..

కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో ఆయన సన్నిహితులకు వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు 

ఏకంగా కానిస్టేబుళ్లకే థర్డ్‌ డిగ్రీ ట్రీట్మెంట్‌తో బరితెగింపు 

డీజీపీకి లేఖ రాసిన పూర్వపు గన్‌మెన్‌.. హైకోర్టులోనూ పిటిషన్‌ 

లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు 

ఇప్పటిదాకా ఏకంగా 39 మందిపై అక్రమ కేసులు

చంద్రబాబు డైరెక్షన్‌లోనే మద్యం అక్రమ కేసు దర్యాప్తు

బేతాళ కుట్ర అమలవుతోందనేందుకు ఇదే పక్కా నిదర్శనం

సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించి­న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పనితీరు. దర్యాప్తు ముసు­గు­లో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్‌ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. 

చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్‌ దాష్టీ­కా­నికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యు­న్నత న్యాయస్థానం ఆదేశా­లను బేఖాతరు చేస్తూ సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. 

మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్‌ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. 

బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్‌ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలా­లు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. 

ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్‌ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్‌ యాదవ్‌ (ఏ35), యద్దాల నవీన్‌ (ఏ36), హరీశ్‌ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్‌ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాత­రు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.

పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్‌ డిగ్రీ!
చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్‌ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్‌ ఆఫీసులో నిర్బంధించారు. 

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్‌ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్‌ విభాగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డిని సిట్‌ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. 

తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్‌ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్‌ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్‌ రుచి చూపించారు. 



సిట్‌ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుప­త్రిలో చేరారు.  సిట్‌ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధా­రాలతోసహా హైకోర్టులో పిటిషన్‌ దా­ఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీక­రించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడ
ఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను సిట్‌ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేయడం సిట్‌ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. 

ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్‌ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్‌ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. 

అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్‌ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవ­డం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్‌ విచారణకు రావడా­నికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 

అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్‌ రహస్యంగా లుక్‌ అవుట్‌ నోటీసులిచ్చి అరెస్ట్‌ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్‌ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడా­వుడిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.

బండారం బయట పడుతుందనే..
రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ ని­యో­జకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలి­చారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌­సభ నియో­జకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 

దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌­బుక్‌ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్ర­గిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందు­కోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశా­రు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. 

తాను చెవి­రెడ్డి్డ­పై ­ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగి­తాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టు­గా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసు­ల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మ­ద్యం అక్రమ కేసు నమోదు చే­యాలని ప్రభుత్వ పెద్దలు ఆ­దే­శించారు. అందుకోసం ఆయ­న వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌ రెడ్డి అనే ఏ­ఆర్‌ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూ­లం కోసం బల­వం­తం చేశా­రు. 

చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడు, ఆయన సతీమణిని సిట్‌ అధికారులు విచా­రణ పేరిట హైద­రాబాద్‌ నుంచి విజయవాడ తీసుకు­వచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్‌ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.

మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..
గన్‌మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్‌మెంట్ల కోసం చిత్రహింసలు
రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారు
తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకం
వైఎస్సార్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహం

సాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: లిక్కర్‌ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్‌ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్‌మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. 

మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని వెల్లడించారు. 

తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్‌ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.

ఈ ప్రశ్నలకు బదులేదీ?
మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్‌ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్‌మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి రాజ్‌ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..?  

⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్‌ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?

⇒ మదన్‌రెడ్డిని సిట్‌ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ రాయకుండా, సిట్‌ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్‌మెంట్‌పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?

⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్‌ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్‌ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. 
ఆ హెడ్‌ కానిస్టేబుల్‌ను సిట్‌ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?

⇒ సిట్‌ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్‌ కాదా..?

⇒ ‘‘సిట్‌ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్‌ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? 

⇒ సిట్‌ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్‌ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?

⇒ సిట్‌ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్‌ అధికారులు కోరగలరా..?

⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్‌ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement