
ఎన్టీసీఏ లెక్కల ప్రకారం 6నెలల్లో 91 పులుల మృతి
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రకారం 120 మృత్యువాత
టైగర్ రిజర్వులోనే చనిపోయిన 42 బెబ్బులులు
రణథంబోర్లో మృతి చెందిన ప్రఖ్యాత ఆడపులి యారోహెడ్
దేశంలో ప్రశ్నార్థకంగా మారిన పులుల భద్రత
సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద పులుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఒకవైపు వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతున్నా మరోవైపు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 91 పులులు మృతి చెందాయి. అంటే నెలకు సగటున 15 పులులు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది నమోదైన 126 మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2019 నుంచి 2023 మధ్య దేశవ్యాప్తంగా 628 పులుల మృతి చెందాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 91 పులుల మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 26, మధ్యప్రదేశ్లో 24 చోటుచేసుకున్నాయి. కేరళలో 9, అసోంలో 8, ఉత్తరాఖండ్లో 7, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో 4 చొప్పున, తెలంగాణలో ఒకటి, మిగిలినవి ఆయా రాష్ట్రాల్లో మరణించినట్లు గుర్తించారు. వీటిలో కొన్ని రైలు ప్రమాదాల వల్ల జరగ్గా, కొన్ని వ్యాధుల వల్ల, మరికొన్ని మానవ–వన్యప్రాణి ఘర్షణల వల్ల చోటుచేసుకున్నాయి. మృతి చెందిన 91 పులుల్లో 42 వాటి సంరక్షిత ప్రాంతాల్లోనే (టైగర్ రిజర్వులు) ప్రాణాలు కోల్పోయాయి.
వేటగాళ్లు్ల చంపిన పులులు 24
వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీఎస్ఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 120 పులులు మృత్యువాత పడ్డాయి. అందులో 96 సహజ, మానవ–వన్యప్రాణి సంఘర్షణల వల్ల మృతి చెందినట్లు తేలింది. 24 పులుల్ని వేటగాళ్లు చంపినట్లు వార్తలు వచ్చాయి. గత 12 ఏళ్లలో దేశంలో మొత్తం 1,386 పులులు మరణించాయని డబ్ల్యూపీఎస్ఐ తెలిపింది.
సవాలుగా మారిన పులుల సంరక్షణ..
ఆవాసాల కోసం కొన్నిచోట్ల పులుల మధ్య తీవ్రమైన టెరిటోరియల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఘర్షణలతో మృత్యువాత పడుతున్నాయి. నగరీకరణ, రహదారుల విస్తరణ, వ్యవసాయానికి అడవుల వినియోగం వల్ల టైగర్ రిజర్వులు కుంచించుకుపోవడంతో వాటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఎన్టీసీఏ లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2010లో 1,706గా ఉండగా.. 2022 నాటికి అవి 3,700కి పెరిగాయి. ప్రస్తుతం 1,57,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పులుల ఆవాసాలు సామాజిక–ఆరి్థక కారణాల వల్ల క్షీణిస్తున్నాయి.
వాటి రక్షిత, ఆవాస ప్రాంతాలను విస్తరించడం, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం, పులుల ఆవాసాల సమీపంలో నివసించే వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా మానవ–వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అడవులను అనుసంధానించే టైగర్ కారిడార్ల ఏర్పాటు, రైలు మార్గాల్లో హీట్–సెన్సింగ్ అలర్ట్లు, స్పీడ్ లిమిట్లు విధించాలని సూచిస్తున్నారు.
మృతి చెందిన రణథంబోర్ రాణి
రాజస్తాన్లోని రణథంబోర్ టైగర్ రిజర్వ్లో 14 ఏళ్ల ప్రఖ్యాత ఆడపులి యారోహెడ్ శుక్రవారం మృతి చెందిందని అటవీ అధికారులు ధ్రువీకరించారు. బోన్ క్యాన్సర్, మెదడు ట్యూమర్ వల్ల మరణించినట్లు వెల్లడించారు. ఈ పులికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖంపై బాణం(యారో) ఆకారంలో ఉన్న చారల వల్ల దీనికి యారోహెడ్ అనే పేరు వచ్చింది. ఫొటోగ్రాఫర్లు, పర్యాటకులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పులిని ‘క్రొకడైల్ హంటర్’ అని కూడా పిలిచేవారు. సరస్సులోని మొసళ్లను వేటాడే అరుదైన పులిగా యారోహెడ్ గుర్తింపు పొందింది.