
వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు
అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలు
లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కుతంత్రం..
దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు
సిట్ వేధిస్తోందంటూ ముందస్తు బెయిల్ కోసం మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి
ఆయన్ను వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా?
బెవరేజస్ కార్పొరేషన్లో పనిచేసే చిన్న ఉద్యోగులను బెదిరించి చెప్పించిన సాక్ష్యాలకు విలువెంత?
కూటమికి లబ్ధి చేకూర్చేలా మూడున్నరేళ్ల ముందే రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయి మాటలు బాబు కుట్రలో భాగమే..
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు.
తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.
వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.
దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకం
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు.
తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది.
వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.
అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బరితెగిస్తున్న సిట్
ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా.

వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.
అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి
అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి.
మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.
మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?
మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు.
ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్కు చైర్మన్గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.
అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానం
చట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది.
ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది.
మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు.
కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం.
వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం.