ఫోర్జరీ పోలీస్‌! | GRP head constable forged the signature of the Intelligence DIG | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ పోలీస్‌!

Jun 6 2025 2:51 AM | Updated on Jun 6 2025 2:51 AM

GRP head constable forged the signature of the Intelligence DIG

ఇంటెలిజెన్స్‌ డీఐజీ సంతకం ఫోర్జరీ చేసిన జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌

తాను ఎస్‌ఐని అంటూ నకిలీ ఐడీ కార్డు సృష్టి

పలు ప్రాంతాల్లో దందాలు

బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ బృందం

కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్‌ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నా­డు. దాన్ని చూపించి ఎస్‌ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వర­రావు గవర్న­మెంట్‌ రైల్వే పోలీస్‌ విభాగం(జీఆర్పీ)­లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

రాజమహేంద్రవరం రైల్వే సబ్‌ డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్‌ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమ­హేంద్రవరం రైల్వే సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లలో ఉద్యోగులపై అజమా­యిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్‌ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్‌ తనను వేధిస్తు­న్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జవాన్‌ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్‌కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్‌ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. 

ఫిర్యాదు చేసిన జవాన్‌ భార్యను రైల్వే గెస్ట్‌ హౌస్‌కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్‌ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్‌ భార్య కాకినాడ టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్‌కి చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement