Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్ | GJ Reddy Son Filed Case Against Margadarsi chairman Ramoji Rao | Sakshi
Sakshi News home page

Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్

Oct 16 2023 7:54 PM | Updated on Oct 17 2023 10:07 AM

GJ Reddy Son Filed Case Against Margadarsi chairman Ramoji Rao - Sakshi

రామోజీరావు ఖాతాలోకి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. మార్గదర్శి వ్యవస్థాపకుడు..

సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై  ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. 

తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది.

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్‌హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. 

యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని..  కమ్యూనిస్ట్‌ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి  రికమండ్‌ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్‌ కమ్‌ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్‌ స్కిల్స్‌ చూపించి.. తన తండ్రికి  దగ్గరయ్యారని, ఆపై చిట్‌ఫండ్‌కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 



1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన.

గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్‌ అయ్యాడు?

వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్‌పై నో అబ్జెక్షన్‌ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్‌ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్‌ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన.

అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్

యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది.  యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం.

Advertisement
 
Advertisement
Advertisement