ED Speeding Up Investigation In AP Skill Scam Case, Details Inside - Sakshi
Sakshi News home page

AP Skill Scam: స్పీడ్‌ పెంచిన ఈడీ.. చక్రం తిప్పిన టీడీపీ కీలక నేత!

Published Sat, Apr 29 2023 7:47 AM

ED Speeding Up Investigation In AP Skill Scam Case - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వ ముఖ్య నేత సాధనంగా వాడుకున్న షెల్‌ కంపెనీ డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను శుక్రవారం జప్తు చేసింది. 2015–16 లో జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు ముసుగులో ఆ కంపెనీ పేరిట అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే సాగిన ఈ కుంభకోణం కోసం డిజైన్‌ టెక్‌ అనే కంపెనీని తెరపైకి తెచ్చారు. అనంతరం ఆ కంపెనీ వెచి్చంచాల్సిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.370 కోట్లను విడుదల చేశారు. అనంతరం ఆ నిధులను డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి వేర్వేరు షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించి అక్కడి నుంచి హవాలా విధానంలో హైదరాబాద్‌లోని అప్పటి ప్రభుత్వ ముఖ్య నేత నివాసానికి మళ్లించారు. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసి కీలక ఆధారాలను సేకరించింది. 

మనీ లాండరింగ్‌కు పాల్పడి నల్లధనాన్ని తరలించినందున  కుంభకోణంపై దృష్టి సారించాలని ఈడీని సీఐడీ కోరింది. రంగంలోకి దిగిన ఈడీ  కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు, షెల్‌ కంపెనీల ప్రతినిధులను విచారించింది. డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ ఖన్వేల్కర్, సీమెన్స్‌ ప్రాజెక్టు మాజీ ఎండీ సుమన్‌ బోస్, ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేశ్‌ గోయల్‌ను  అరెస్టు చేసింది.  తాజాగా డిజైన్‌ టెక్‌కు చెందిన డిపాజిట్లను ఈడీ జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

ఇది కూడా చదవండి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో సీఐడీ దూకుడు 

Advertisement
Advertisement