సత్తా చాటిన నౌకాదళం | Eastern Naval Exercises at Visakhapatnam RK Beach | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన నౌకాదళం

Jan 5 2025 5:25 AM | Updated on Jan 5 2025 5:25 AM

Eastern Naval Exercises at Visakhapatnam RK Beach

నేవీ విన్యాసాలతో యుద్ధ రంగాన్నితలపించిన విశాఖ ఆర్కే బీచ్‌

అబ్బురపరిచిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకల పాటవం 

ఒళ్లు గగుర్పొడిచేలా నౌకాదళం, మెరైన్‌ కమాండోల సాహసోపేత విన్యాసాలు 

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్‌కె బీచ్‌ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్‌ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజర­య్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.

నౌకాదళం, మెరైన్‌ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేత­మైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్‌ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టు­కుంది. ఆయిల్‌ రిగ్‌ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్‌లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్‌ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. 

డార్నియర్‌ హెలికాప్టర్, హాక్‌ జెట్‌ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్‌తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్‌ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 

8న పీఎంచే రైల్వే జోన్‌కు శంకుస్థాపన: చంద్రబాబు
నావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్‌కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్‌టీపీసీ–జెన్‌కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. 

విశాఖలో త్వరలో టీసీఎస్‌ ఏర్పాటు కానుందని, గూగుల్‌  డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.

నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతి
ఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్క­డైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ చెప్పారు. విశాఖ వేది­కగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్య­క్రమాలను విజయవంతంగా నిర్వహించా­మని తెలిపారు. సామాజిక సేవ, పర్యావ­రణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగ­మ­వుతోందని అన్నారు. 

ఇటీవల నిర్వ­హించిన నేవీ మారథాన్‌లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చా­రని చెప్పా­రు. తూర్పు నావికాదళానికి విశా­ఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకా­రాలు మరు­వలేనివని అన్నారు. ఈ కార్యక్ర­మంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో పాటు మంత్రులు, అధికా­రులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనే­శ్వ­రి, తదితరులు హాజర­య్యా­రు.

Advertisement
 
Advertisement
Advertisement