సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి కూటమిలో విభేదాలు ముదిరాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్ను ప్రోత్సహిస్తున్నారంటూ మనోహర్ ఫిర్యాదు చేశారు.
కాగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.
గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.


