
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నుంచి గురువారం వరకు జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చిస్తారని, స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.
ఈ సదస్సులో 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు పాల్గొంటారని, వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకుని, రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తారని తెలిపింది. తొలి రోజు ఉదయం ఆర్టిజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై, మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, శాంతిభద్రతలు వంటి అంశాలపై చర్చిస్తారని వివరించింది.