ఎఫ్‌ఆర్‌బీఎం మార్గదర్శకాలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review On FRBM Guidelines At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలంటూ రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో, దీనికోసం కేంద్రం నిర్దేశించిన  మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా, ఒన్‌ నేషన్‌–ఒన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మున్సిపాల్టీలు– కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్‌రంగం.. ఈ నాలుగు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పిన సంస్కరణలను అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని సహా ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

1. దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ పొందేలా కేంద్రం ఒన్‌ నేషన్‌-ఒన్‌ రేషన్‌ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్‌ పంపిణీలో పారదర్శకతకోసం బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విధానంలో రాష్ట్రం ముందు ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకొని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టంచేశారు. (కోవిడ్‌ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం)

2. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్‌టేపిజానికి దూరంగా సింగిల్‌ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. అలాగే రెన్యువల్స్‌ విషయంలో కూడా పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. 

3. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రతకూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్‌ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. పరిశ్రమల్లో కాలుష్యంపైనగాని, భద్రతపైన గాని ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టంచేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య  నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.  (మార్కెటింగ్‌ కేంద్రాలుగా ఆర్‌బీకేలు..)

4. అలాగే కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్‌ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి వేగంగా నడిపించడానికి, మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం ఈ సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్రం చెప్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టంచేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. 

5. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధికోసం సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మీదట సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు ఉండాలని స్పష్టంచేశారు. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందనప్పుడు– వీటికి ఫీజులు అడగడం సరికాదన్నారు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. (కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు)

6. విద్యుత్‌రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని, అలాగే ఏసీఎస్‌ – ఏఆర్‌ఆర్‌ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాలనుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అంతేకాక ఉచిత విద్యుత్‌ రూపంలో ప్రభుత్వంపైన భారాన్ని తగ్గించుకునేందుకు, పగటిపూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10వేల మెగావాట్ల సోలార్‌ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు.

దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్‌ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని ఇప్పటికే దీనికి సంబంధించి 82శాతానికి పైగా పనులు పూర్తయ్యాయయని, మిగిలిన పనులు కూడా పూర్తయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top