సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసుల ఆత్మస్థైర్యంపై తరచూ మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి.. అదే పోలీసుల్లో కొందరిపై ఆరోపణలు వస్తుండటంపై సమాధానం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులే వీడియో సందేశాలు విడుదల చేస్తుండటం.. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై స్టేషన్లో ప్రత్యర్థులు దాడులు చేస్తుండటం.. ఒక పత్రికా కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినా అరెస్టు చేయకపోవడం.. అధికార పార్టీకి అనుకూలంగా మారి శాంతిభద్రతలను గాలికి వదిలేయడం.. రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులు నోరు విప్పినా చర్యలు తీసుకోకపోవడం.. ఇలాంటి ఆరోపణలను పరిశీలిస్తే జిల్లాలో శాంతిభద్రతలే ప్రశ్నార్థకంగా మారాయన్నది ప్రజల మాట. అంతర్రాష్ట్ర గ్యాంగులు పెచ్చుమీరిపోతున్నా.. రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా.. పత్రికల్లో మీకు నచ్చని కథనాలు వస్తే మీడియాపై బెదిరింపులు దిగడం.. ఆధారాలుంటే చూపించండి లేదంటే కేసులు పెడతామనడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
2024 డిసెంబర్ 21న కొరసవాడ వద్ద పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు ఆటోను ఢీకొట్టడంతో, దాంట్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోష్ సవలాపురం నరేష్, గణేష్ ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారకులెవరో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో దగ్గరుండి బాధితులు బయటకు రాకుండా జాగ్రత్త పడిందెవరో?ఇటీవల పలాస నియోజకవర్గం మందస మండలం పితాతొళి వద్ద మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన నర్తు వెంకటరమణ కుటుంబీకుల ఆవేదన విన్నారా? మృతుడు భార్య, తల్లి, సోదరుడు మీడియాకు చెప్పింది నమ్మరా? వాళ్ల వేదన పట్టదా? ప్రమాద కారకులెవరో మండలమంతా తెలుసు.
కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై పోలీసుల ముందే టీడీపీ నాయకులు దాడి చేస్తే ఏం చేశారు? చూస్తూ ఊరుకోవడం తప్ప వారిపైనా చర్యలు తీసుకున్నారా?
పాతపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోనే పేకాట ఆడుతున్న బాగోతాలు బయటపడ్డాయి. పలువురి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అంత ధైర్యంగా పోలీసు స్టేషన్కు సమీపంలో పేకాట ఆడుతున్నారంటే వారి వెనకున్నదెవరు? సహకరిస్తున్నదెవరో ? తేల్చారా?
∙మెళియాపుట్టిలో గంజాయి గుట్టు విప్పినందుకు ఓ యువకుడ్ని ఓ ఎస్ఐ చితక బాదడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బాధితుడు ఊరు వదిలి వెళ్లిపోయాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ యువకుడు, సంబంధీకులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి..?హత్యాయత్నం కేసులో నిందితుడైన సొంఠ్యాన హరి నుంచి లంచం తీసుకుని పోలీసులే తనను తప్పించారని కొత్తూరు పోలీసులపై ఎస్పీకి వీడియో సందేశం పంపిన విషయం తాజాగా మరింత సంచలనమైంది. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉందా? అంత ధైర్యంగా నిందితుడు చెబుతున్నాడంటే అక్కడేం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. తనతోనే వదిలేయలేదు. వేరే వ్యక్తి నుంచి కూడా ఐఫోన్లు, సొమ్ములు వసూలు చేసిన విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ఈ అంశంపై మీ స్పందన ఏమిటి..?
ఎచ్చెర్లలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై టీడీపీ యువజన విభాగం నాయకుడు మెండ దాసునాయుడు మరికొందరు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించారు. ఆ ఘటనకు సంబంధించి ఏం కేసులు పెట్టారు? ఎవర్ని అరెస్టు చేశారో చెప్పగలరా?
ఇలా చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయి. ఘోరాలెన్నో జరుగుతున్నాయి. వాటిపై చర్యలు లేవు. సమాధానాలు లేదు. కానీ, పత్రికల్లో వచ్చిన కథనాలు తమకు నచ్చకపోతే ఆధారాలు చూపించండి..లేకపోతే కేసులు పెడతామంటున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను లోతుగా పరిశీలించాలే తప్ప కేసులు పెడతామని బెదిరిస్తే.. ప్రజలకు న్యాయం జరిగేలా మీడియా అండగా ఉండగలదా? అన్నది తమరే చెప్పాలి.
రెచ్చిపోతున్న దొంగలు..
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో కక్షా రాజకీయ కేసుల్లో పోలీసులు బిజీ అయ్యారు. ప్రాపర్టీ, గ్రేవ్, పెండింగ్ కేసులను వదిలేసి సివిల్ కేసుల్లో వచ్చే కాసులు, దానికి రాజకీయ కోణం జోడించి కేసులు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే మంచి తరుణమని భావించి అంతర్రాష్ట్ర గ్యాంగులు జిల్లాలో చొరబబడేందుకు యత్నంస్తుండటం జిల్లావాసులను కలవరపరుస్తోంది.
లెక్కకు మించి నేరాలు చేసిన ఉత్తరప్రదేశ్ నేరస్థుడొకడు జిల్లాకేంద్రంలోని బలిజేపల్లివారి వీధిలో ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నట్లుగా తెలుసుకున్న అక్కడి పోలీసులు ఇటీవలే ఇక్కడికి వచ్చారు. వారొచ్చేసరికే నేరస్థుడు పరారయ్యాడు. ఆశ్రయమిచ్చిన వ్యక్తిని విచారించి పోలీసులు వెనుదిరిగారు.
కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూయలెర్స్ దోపిడీకి యూపీ, ఒడిశా గ్యాంగులతో స్కెచ్ గీసిన వ్యక్తి కొన్నేళ్లపాటు బంగారం వ్యాపారం పేరిట తిష్ట వేశాడు. ఈయనది ఒడిశా. అక్కడి క్రైమ్ రికార్డుల్లోని పాత నిందితుడనేది చోరీ ఛేదించేవరకు పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికీ యూపీ గ్యాంగు జాడ పోలీసులు కనిపెట్టలేదు. పూండి భారీ చోరీకి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠా జాడ లేదు.
టెక్కలి, కాశీబుగ్గ భారీ చోరీ కేసుల్లో ఇటీవల పట్టుబడిన ఇద్దరు నిందితుల సొంతరాష్ట్రం పశ్చిమబెంగాల్. ఒడిశా బరంపురంలో ఉంటూ వ్యాపారం పేరిట జిల్లాలో తిరిగి పగలు ఇళ్లను రెక్కీ చేసి రాత్రుళ్లు చోరీ చేశారు.


