breaking news
Maheswara reddy
-
పోలీసుల ఆత్మస్థైర్యం సరే.. ప్రజల నమ్మకం మాటేంటి?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసుల ఆత్మస్థైర్యంపై తరచూ మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి.. అదే పోలీసుల్లో కొందరిపై ఆరోపణలు వస్తుండటంపై సమాధానం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులే వీడియో సందేశాలు విడుదల చేస్తుండటం.. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై స్టేషన్లో ప్రత్యర్థులు దాడులు చేస్తుండటం.. ఒక పత్రికా కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినా అరెస్టు చేయకపోవడం.. అధికార పార్టీకి అనుకూలంగా మారి శాంతిభద్రతలను గాలికి వదిలేయడం.. రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులు నోరు విప్పినా చర్యలు తీసుకోకపోవడం.. ఇలాంటి ఆరోపణలను పరిశీలిస్తే జిల్లాలో శాంతిభద్రతలే ప్రశ్నార్థకంగా మారాయన్నది ప్రజల మాట. అంతర్రాష్ట్ర గ్యాంగులు పెచ్చుమీరిపోతున్నా.. రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా.. పత్రికల్లో మీకు నచ్చని కథనాలు వస్తే మీడియాపై బెదిరింపులు దిగడం.. ఆధారాలుంటే చూపించండి లేదంటే కేసులు పెడతామనడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు బదులేదీ? 2024 డిసెంబర్ 21న కొరసవాడ వద్ద పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు ఆటోను ఢీకొట్టడంతో, దాంట్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోష్ సవలాపురం నరేష్, గణేష్ ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారకులెవరో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో దగ్గరుండి బాధితులు బయటకు రాకుండా జాగ్రత్త పడిందెవరో? ఇటీవల పలాస నియోజకవర్గం మందస మండలం పితాతొళి వద్ద మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన నర్తు వెంకటరమణ కుటుంబీకుల ఆవేదన విన్నారా? మృతుడు భార్య, తల్లి, సోదరుడు మీడియాకు చెప్పింది నమ్మరా? వాళ్ల వేదన పట్టదా? ప్రమాద కారకులెవరో మండలమంతా తెలుసు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై పోలీసుల ముందే టీడీపీ నాయకులు దాడి చేస్తే ఏం చేశారు? చూస్తూ ఊరుకోవడం తప్ప వారిపైనా చర్యలు తీసుకున్నారా? పాతపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోనే పేకాట ఆడుతున్న బాగోతాలు బయటపడ్డాయి. పలువురి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అంత ధైర్యంగా పోలీసు స్టేషన్కు సమీపంలో పేకాట ఆడుతున్నారంటే వారి వెనకున్నదెవరు? సహకరిస్తున్నదెవరో ? తేల్చారా? ∙మెళియాపుట్టిలో గంజాయి గుట్టు విప్పినందుకు ఓ యువకుడ్ని ఓ ఎస్ఐ చితక బాదడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బాధితుడు ఊరు వదిలి వెళ్లిపోయాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ యువకుడు, సంబంధీకులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి..? హత్యాయత్నం కేసులో నిందితుడైన సొంఠ్యాన హరి నుంచి లంచం తీసుకుని పోలీసులే తనను తప్పించారని కొత్తూరు పోలీసులపై ఎస్పీకి వీడియో సందేశం పంపిన విషయం తాజాగా మరింత సంచలనమైంది. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉందా? అంత ధైర్యంగా నిందితుడు చెబుతున్నాడంటే అక్కడేం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. తనతోనే వదిలేయలేదు. వేరే వ్యక్తి నుంచి కూడా ఐఫోన్లు, సొమ్ములు వసూలు చేసిన విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ఈ అంశంపై మీ స్పందన ఏమిటి..? ఎచ్చెర్లలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై టీడీపీ యువజన విభాగం నాయకుడు మెండ దాసునాయుడు మరికొందరు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించారు. ఆ ఘటనకు సంబంధించి ఏం కేసులు పెట్టారు? ఎవర్ని అరెస్టు చేశారో చెప్పగలరా? ఇలా చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయి. ఘోరాలెన్నో జరుగుతున్నాయి. వాటిపై చర్యలు లేవు. సమాధానాలు లేదు. కానీ, పత్రికల్లో వచ్చిన కథనాలు తమకు నచ్చకపోతే ఆధారాలు చూపించండి..లేకపోతే కేసులు పెడతామంటున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను లోతుగా పరిశీలించాలే తప్ప కేసులు పెడతామని బెదిరిస్తే.. ప్రజలకు న్యాయం జరిగేలా మీడియా అండగా ఉండగలదా? అన్నది తమరే చెప్పాలి. రెచ్చిపోతున్న దొంగలు.. శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో కక్షా రాజకీయ కేసుల్లో పోలీసులు బిజీ అయ్యారు. ప్రాపర్టీ, గ్రేవ్, పెండింగ్ కేసులను వదిలేసి సివిల్ కేసుల్లో వచ్చే కాసులు, దానికి రాజకీయ కోణం జోడించి కేసులు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే మంచి తరుణమని భావించి అంతర్రాష్ట్ర గ్యాంగులు జిల్లాలో చొరబబడేందుకు యత్నంస్తుండటం జిల్లావాసులను కలవరపరుస్తోంది. లెక్కకు మించి నేరాలు చేసిన ఉత్తరప్రదేశ్ నేరస్థుడొకడు జిల్లాకేంద్రంలోని బలిజేపల్లివారి వీధిలో ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నట్లుగా తెలుసుకున్న అక్కడి పోలీసులు ఇటీవలే ఇక్కడికి వచ్చారు. వారొచ్చేసరికే నేరస్థుడు పరారయ్యాడు. ఆశ్రయమిచ్చిన వ్యక్తిని విచారించి పోలీసులు వెనుదిరిగారు. కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూయలెర్స్ దోపిడీకి యూపీ, ఒడిశా గ్యాంగులతో స్కెచ్ గీసిన వ్యక్తి కొన్నేళ్లపాటు బంగారం వ్యాపారం పేరిట తిష్ట వేశాడు. ఈయనది ఒడిశా. అక్కడి క్రైమ్ రికార్డుల్లోని పాత నిందితుడనేది చోరీ ఛేదించేవరకు పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికీ యూపీ గ్యాంగు జాడ పోలీసులు కనిపెట్టలేదు. పూండి భారీ చోరీకి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠా జాడ లేదు. టెక్కలి, కాశీబుగ్గ భారీ చోరీ కేసుల్లో ఇటీవల పట్టుబడిన ఇద్దరు నిందితుల సొంతరాష్ట్రం పశ్చిమబెంగాల్. ఒడిశా బరంపురంలో ఉంటూ వ్యాపారం పేరిట జిల్లాలో తిరిగి పగలు ఇళ్లను రెక్కీ చేసి రాత్రుళ్లు చోరీ చేశారు. -
భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం భూముల రీ సర్వే కార్యక్రమం జరుగుతోందని, సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. చట్టం ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి లేదని, కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని అభ్యర్థించారు. మహేశ్వరరెడ్డి వాదనతో సంతృప్తి చెందిన హైకోర్టు.. ఒకవేళ ఈలోగా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే, పిటిషనర్లు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పట్టుబట్టగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పష్టమైన ఆదేశాలి చ్చి నా.. ఎందుకీ ఆందోళన! భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయబోమని గత విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హామీ ఇచ్చారని, అప్పుడు ఆ హామీని రికార్డ్ చేయలేదని అన్నారు. ఏజీ హామీని రికార్డ్ చేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన దావాలను విచారణ నిమిత్తం తీసుకోవాలని కింది కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, అయినా ఆందోళన ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం ముందుకెళుతోందని, అందువల్ల సంబంధిత జీవోలపై స్టే విధించాలని కోరారు. అసలు చట్టం అమలు ప్రస్తుతం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టం అమలుకు నిబంధనలు అవసరమని, ఇప్పటివరకు నిబంధనల రూపకల్పనే జరగలేదని తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ‘ఐ’క్యత
నిర్మల్ సభ ఏర్పాట్లకు ప్రతిబంధకాలు అదేరోజు ఢిల్లీకి వెళ్లనున్న టీ-మంత్రులు డీసీసీ సదస్సుకు దూరంగా ప్రేమ్సాగర్ వర్గం ఎమ్మెల్యేలు మహేశ్వర్, సక్కు హాజరు రచ్చబండ వాయిదా వేస్తేనే సభకు మంచిది ఇద్దరు ఎమ్మెల్యేలకు సీఆర్ఆర్ సూచన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జైత్రయాత్ర సభ నిర్వహణ ఏర్పాట్లు బాలారిష్టాలు దాటడం లేదు. నిర్మల్లో 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు గడువు సరిగ్గా ఆరు రోజులే ఉంది. ఓ వైపు ఆ పా ర్టీలో కొలిక్కిరాని గ్రూపు తగాదాలు.. మరోవైపు రెండు రోజుల ముందు మొదల య్యే రచ్చబండ మూడో విడత.. 12, 13 తేదీల్లో ఢిల్లీకి టీ-మంత్రుల పయనం.. ఇవన్నీ జైత్రయాత్రకు ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. నిర్మల్ కేంద్రంగా నిర్వహించే సభకు సక్సెస్ చేయడం కోసం బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డితో విభేదాలున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తదితరులు హాజరుకాలేదు. ఓ వైపు అధికార కార్యక్రమాలు, మరోవైపు టీ-మంత్రుల పర్యటనల నేపథ్యంలో సభను 13న నిర్వహిస్తారా? లేక మరో రోజుకు వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ సభకు ప్రేమ్సాగర్ దూరం నిర్మల్లో 13న నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి వర్గంగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నడిపెల్లి దివాకర్రావు కార్యకర్తలతో హాజరయ్యారు. ప్రేమ్సాగర్రావు గ్రూపునకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జాదవ్ అనిల్కుమార్లతోపాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనా, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా నాయకత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదు. జైత్రయాత్ర సభ సక్సెస్కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించి ఏర్పాటు చేసిన సమావేశానికి కేడర్ అంతంత మాత్రంగానే హాజరుకావడం, రెండు గ్రూపులకు చెందిన కొందరు నేతలు హాజరైనా ముఖ్య నేతల గైర్హాజరు కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. జైత్రయాత్రపై రచ్చబండ ప్రభావం నిర్మల్లో 13న జైత్రయాత్ర సదస్సుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుండగా అంతకు రెండు రోజుల ముందే రచ్చబండ మూడో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటు జైత్రయాత్ర సభ, అటు మూడో విడత రచ్చబండ రెండు కూడా పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభ నిర్వహిస్తే రచ్చబండ ప్రభావం పడే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర, తెలంగాణకు చెందిన మంత్రులు ఈనెల 12,13 తేదీల్లో వేర్వేరుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం వేర్వేరుగా తెలంగాణ విభజనకు సంబంధించిన 11 విధివిధానాలను సూచించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం టీ-మంత్రులకు అనివార్యం. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభకు టీ-మంత్రులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేస్తేనే జైత్రయాత్ర సభను సక్సెస్ చేసుకోవచ్చని.. దీనికి నిర్మల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, ఆత్రం సక్కు చొరవ చూపి ప్రభుత్వం ప్రకటన చేయించాలని సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సూచించడం గమనార్హం. ఈ క్రమంలో నిర్మల్లో సభపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


