సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులంటే చిన్నచూపు చూడటం.. ఎదిగిన నేతలను అణగదొక్కడం, అక్రమ కేసులు బనాయించడం, పదవుల కేటయింపులో మొండిచెయ్యి చూపడం.. ఇవీ చంద్రబాబు తన పాలనలో మత్స్యకారుల పట్ల వ్యవహరిస్తున్నారు తీరుకు నిదర్శనాలు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇందుకు పూర్తి భిన్నం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం, పదవుల్లో పెద్దపీట వేయడం వంటి చర్యలతో మత్స్యకారులకు అండగా నిలిచారు.
చంద్రబాబు పాలనలో..
పాక్ జైల్లో మగ్గిన మత్స్యకారులు 2018 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వంలో గుజరాత్ రాష్ట్రంలో వీరావల్ నుంచి వేటకెళ్లిన ఎచ్చెర్ల మత్స్యకారులు సముద్రంలో దారి తప్పి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. దారితప్పిన మత్స్యకారులపై పాకిస్తాన్.. దేశద్రోహం కేసులు పెట్టి సుదీర్ఘకాలం జైలులో పెట్టింది. 20మంది మత్స్యకారులు పాక్ జైల్లో మగ్గుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
పత్తా లేని టీడీపీ..
కోవిడ్ విజృంభణతో ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు బిక్కుబిక్కుమని ఇళ్లల్లో మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకో వైపు ఇంటి పెద్దలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండిపోయారు. ఆ సమయంలో టీడీపీ కనీసం పట్టించుకోలేదు. తమ ప్రాణాలే ముఖ్యమని పచ్చ నాయకులు ఎవరింట్లో వారు దాక్కున్నారు. ఇక, మత్స్యకారులను ఇంకేం ఆదుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఒక్క మేలూ జరగలేదు..
మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మేలూ చేయలేదు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు. ప్రతిసారి భావనపాడు పోర్టు అన్నారే తప్ప దాన్ని అమల్లోకి తేలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యధిక పనులు పూర్తయినప్పటికీ మూలపేట పోర్టును గాలికొదిలేసింది. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ను పక్కన పెట్టేసింది. మత్స్యకారులకు ఇవ్వాల్సిన వేట విరామ భృతిలో అక్రమాలకు పాల్పడుతోంది.
పదవుల్లోనూ దగా..
మత్స్యకార సామాజిక వర్గంలో ఎదుగుతున్న నాయకులను చంద్రబాబు అణగదొక్కుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను రాజకీయంగా వేధిస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఆ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి పనిచేయలేదు. సరికదా ఎదుగుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.
వైఎస్ జగన్ హయాంలో..
పాకిస్తాన్ నుంచి జిల్లాకు తీసుకొచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు చేసి 2020 జనవరి 6న వారందరినీ విడుదల చేయించింది. స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలిచింది.
కోవిడ్లో అండగా..
కోవిడ్లో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 5,500 మంది మత్స్యకారులను బోట్లు, 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారందరికీ ప్రత్యేక వసతులు కల్పించి, తక్షణ సాయం కింద రూ.2వేల ఆర్థిక సాయం చేశారు.
అభివృద్ధిలో కీలక అడుగులు
సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రూ. 2,949.70కోట్లతో మూలపేట పోర్టు మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి పనులు చకచకా సాగించారు. చివరి దశకు తీసుకొచ్చారు. బుడగట్లపాలెంలో రూ.366కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసి, పనులు ప్రారంభించారు. మంచినీళ్ల పేటలో జెట్టీ పనులకు శ్రీకారం చుట్టారు. వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట రూ.10వేలు చొప్పున ఇచ్చారు. బోట్ల కోసం లీటర్కి రూ.9 చొప్పున డీజిల్ సబ్సిడీ, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇచ్చారు. నియోజకవర్గానికొక ఆక్వా ల్యాబ్, 66 మంది సాగర మిత్ర ఉద్యోగులు, గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగులను ఏర్పాటు చేశారు.
పదవుల్లో పెద్దపీట..
మత్స్యకారులను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులను ఎమ్మెల్యేను చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్.. ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి, వైద్యుడైన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా మంత్రి పదవిలో కూర్చొబెట్టారు. మత్స్యకారుల కోసం వైఎస్సార్, వైఎస్ జగన్ అండగా నిలిచి, రాజకీయంగా చేయూతనిచ్చారు.


