వైఎస్సార్‌ నేతన్న నేస్తంతో చేనేతల జీవితాల్లో వెలుగులు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ నేతన్న నేస్తంతో చేనేతల జీవితాల్లో వెలుగులు

Published Mon, Jul 31 2023 4:40 AM

CM Jagan efforts for the development of handloom industry - Sakshi

మంగళగిరి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని పలువురు చేనేత ప్రముఖులు ప్రశంసించారు. నగరంలోని జాతీయ రహదారి వెంట గల ఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌లో ఆదివారం వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ సదస్సు–2023 నిర్వహించారు. ముఖ్య అతిథి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని, నేతన్నలంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు.వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు అంజన్‌ కర్నాటి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ సహాయ సహకారాలు అందిస్తోందని, కార్మికులకు అవసరమైన మగ్గాలు, రాట్నాలతో పాటు పేద కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.

ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఎల్‌ రమణ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు అంజన్‌ కర్నాటి(అమెరికా), డాక్టర్‌ హరనాథ్‌ పోలిచర్ల(డెట్రాయిట్‌), రమేష్‌ మునుకుంట్ల(కెనడా), రాజ్‌ అడ్డగట్ల (చికాగో), సారథి కార్యంపూడి(డల్లాస్‌), మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి నరహరి, పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి, దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర, కుర్ణిశాలి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బుట్టా శారద, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర చేనేత సంస్థలను పునరుద్ధరించాలి
సదస్సులో ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. చీరాల, రాజమహేంద్రవరం రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం అసెంబ్లీ స్థానాలతో పాటు,  హిందూపురం, కర్నూలు, రాజమండ్రి పార్లమెంట్‌ స్థానాలను చేనేతలకు కేటాయించాలని తీర్మానించారు. చేనేత ఉత్పత్తులు చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించాలని తీర్మానించారు.  

Advertisement
Advertisement