సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌ | CI And Head Constable Arrested In Nandyal Family Suicide Case | Sakshi
Sakshi News home page

నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

Nov 8 2020 6:09 PM | Updated on Nov 8 2020 9:51 PM

CI And Head Constable Arrested In Nandyal Family Suicide Case - Sakshi

సాక్షి, విజయవాడ : నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తును పోలీస్‌ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సీఐ సోమశేఖర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్లే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. మరోవైపు  ఐజీ శంకబ్రతబాగ్జి, ఐపీఎస్‌ అధికారి అరిఫ్‌ అఫీజ్‌ కేసు విచారణను ప్రారంభించారు.   (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య)

కాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అబ్దుల్‌ సలాం (45), అతని భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. (కుటుంబం ఆత్మహత్యపై విచారణకు సీఎం ఆదేశం)

24 గంటల్లోనే చర్యలు
షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏయే సెక్షన్లు
భారత శిక్ష్మాస్మృతి (ఐపీసీ) సెక్షన్–34లోని సెక్షన్–323, సెక్షన్–324, సెక్షన్–306 కింద సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లపై కేసులు నమోదు చేశారు.  (వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!)

మైనారిటీల హర్షం
షేక్ అబ్దుల్ సలామ్ సెల్ఫీ బయటకు వచ్చిన వెంటనే శరవేగంగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడం, ముగ్గురు ఐపీఎస్ అధికారులను సమగ్ర దర్యాప్తు కోసం నియమించడం, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులను గర్తించి సీఐ, హెడ్ కానిస్టేబుల్ని అరెస్టు చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు హర్షం వక్తం చేశాయి. ప్రభుత్వ చర్యలను మైనారిటీలు స్వాగతించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement