ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆందోళన కలిగిస్తాయి. శాంతిభద్రతల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష, కక్షపూరిత వైఖరివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నట్లు కనబడుతుంది. అందువల్లే కేంద్ర హోం శాఖ ఇచ్చిన నివేదికలో ఏపీకి 26వ ర్యాంకు వచ్చింది. ఒకప్పుడు ఏపీ పోలీసు శాఖకు మంచి పేరు ఉండేది. మొదటి ఐదు ర్యాంకులు సాధించిన రాష్ట్రాలలో ఏపీకి స్థానం లభించేది. అలాంటిది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన మొదలయ్యాక, రెడ్బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నట్లుగా ఈ నివేదిక వల్ల అర్థం అవుతుంది.
తాజా ఉదాహరణ మోసకారి నటిగా పేరొందిన కాదంబరి జత్వాని కేసును ప్రభుత్వం డీల్ చేసిన పద్దతిని తీసుకువచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఎలాగైనా గత జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో కూటమి పెద్దలు రకరకాల ప్లాన్లు వేశారు. అందులో పోలీసు శాఖను అడ్డు పెట్టుకుని పలు తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అదే ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తోంది.
జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీపీ స్థాయి అధికారిని జైలులో పెట్టారు. కొద్దికాలం వైఎస్సార్సీపీలో పనిచేసి, తదుపరి రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యాపార వేత్త అయిన కుక్కల విద్యాసాగరరావు ఎక్కడో డెహ్రాడూన్లో ఉంటే అరెస్టు చేసి తీసుకువచ్చారు. జత్వానికి కూటమి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. స్వయంగా హోం మంత్రి అనిత సంఘీబావం తెలిపారు. ఎల్లో మీడియా అయితే రెచ్చిపోయి, తామే శోధించామని చెబుతూ శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు గంతులేశాయి.
జగన్ ప్రభుత్వంలో ఒక నటీని అక్రమంగా అరెస్టు చేశారని అభియోగం మోపుతూ, ఆమెను ముంబై నుంచి రప్పించి కేసు నమోదు చేసి ఐపీఎస్లను సస్సెండ్ చేసేవరకు వెళ్లారు. అసలు కేసేమిటి? ఈమె తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతున్నదని, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తున్నదని విద్యాసాగరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం కదా. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ వంటివారిని ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో ఆ నటి బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తొలుత జిందాల్ను కూడా కేసులో ఇరికించాలని యత్నించింది. కారణం తెలియదు కాని, ఆ తర్వాత రోజుల్లో ఆయన జోలికి వెళ్లలేదు. బహుశా ఆయనతో రాజీ కుదుర్చుకుని ఉండవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. స్వయంగా ఎల్లో మీడియానే ఈ తరహా వ్యాఖ్య చేయడం గమనార్హం.
విద్యాసాగరరావు పెట్టిన కేసును పక్కనబెట్టి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జత్వాని పక్షాన కొత్త కేసు పెట్టి కథ నడిపించారు. అన్యాయంగా జత్వానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జైలులో పెట్టారని, ఆమె తల్లిదండ్రులను కూడా వేధించారని ఎదురు కేసు పెట్టారు. దీనిని రాష్ట్ర సమస్యగా మార్చి జత్వానికి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన ప్రసంగాలలో పలుమార్లు అప్పట్లో ప్రస్తావించి వైఎస్సార్సీపీపై బురద చల్లేవారు. విద్యాసాగరరావు కొన్నాళ్లు జైలులో ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా అలాగే బెయిల్ పొందారు. విశాల్ గున్నీ, కాంతీలాల్ రాణ అనే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్పై రక్షణ పొందారు. రెడ్బుక్ అరాచకాలలో భాగంగానే ఇలా తప్పుడు కేసు పెట్టారన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
ఈ తరుణంలో సడన్గా కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. జత్వానికి వ్యతిరేకంగా సీఐడీ కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించింది. ఇది సంచనలంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం విద్యాసాగరరావుపైన, ముగ్గురు ఐపీఎస్లపైన తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నట్లయిందన్న విశ్లేషణ వచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం పరువు పోయినట్లయింది. ఈ కేసులో జిందాల్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తపై కూడా తప్పుడు అభియోగాలు మోపే యత్నం జరగడంతో దేశం అంతటా పారిశ్రామికరంగంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చినట్లయింది.
జగన్ ప్రభుత్వం మోసకారి నటి జత్వానిపై చర్య తీసుకుని ఆమె బ్లాక్ మెయిల్కు అడ్డుకట్ట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం జత్వానిని అడ్డుపెట్టుకుని, వైఎస్సార్సీపీనో, ఎవరినో సాధిద్దామనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ నష్టాన్ని గమనించిన ఎల్లో మీడియా వెంటనే మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి డామేజి కంట్రోల్కు ప్రయత్నించింది. విద్యాసాగరరావు పెట్టిన కేసులో జత్వాని చేసింది తప్పని తేలిందని, కాని ఆమెపై కేసు పెట్టిన తీరు, హాండిల్ చేసిన విధానాల్లో లోపాలు ఉన్నాయని, అది వేరే కేసు అని, ఆ కేసులో ఐపీఎస్లను సస్పెండ్ చేయడం జరిగిందని ఎల్లో మీడియా కవరప్ యత్నం చేసింది. పోనీ ఆ అధికారులు చేసిన అక్రమం ఏమిటో అందులో వివరించినట్లు కనబడలేదు.
ఒక మోసకారి నటి ఆట కట్టించడం ఆ ఐపీఎస్లు చేసిన తప్పన్నమాట. జత్వానిపై అన్యాయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కదా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణ! ఇప్పుడు జత్వానీనే బ్లాక్ మెయిలర్ అని, కోటి ముప్పై లక్షల రూపాయలకు పైగా విద్యాసాగర్ నుంచి అక్రమంగా పొందిందని, ఆధార సహితంగా రుజువు అయింది కదా! ఇందులో పోలీసు అధికారుల తప్పు ఏమి ఉంటుంది? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేసేందుకు ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అంటూ కొత్త కథను ఆరంభించారన్నమాట.
ఏది ఏమైనా వైఎస్సార్సీపీ నేతలపైన, అప్పట్లో యాక్టివ్గా పనిచేసిన అధికారులపైన, సోషల్ మీడియావారిపైన, జర్నలిస్టులపైనా కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందనడానికి ఇది పెద్ద ఉదాహరణ అవుతుంది కదా! దీనివల్ల కూటమి సర్కార్ అప్రతిష్ట పాలవుతున్నా ప్రభుత్వ ధోరణిలో పెద్దగా మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి తప్పుడు కేసులతోనే ఏపీ పోలీసు వ్యవస్థ ర్యాంకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అంత ఘోరంగా 26 వ ర్యాంకుకు పడిపోయిందని అనుకోవాలి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


