సాక్షి,విశాఖ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం వేళ, పవిత్ర సింహగిరిపై జరిగిన ప్రకృతి విధ్వంసం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం సింహాచలం కొండపై చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తోందంటూ భక్తులు, పర్యావరణ శ్రేయోభిలాషులు ఆరోపిస్తున్నారు.
పవిత్ర సింహాచలం కొండపై హిపోస్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు నిర్మాణం పేరిట భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారు. ఈ ప్రాజెక్టు కోసం కొండపై ఉన్న వేలాది పచ్చని చెట్లను, వృక్షాలను అడ్డగోలుగా నరికేసి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించారు. గిరి ప్రదక్షిణ చేసే లక్షలాది మంది భక్తులకు కొండకు కొట్టిన బోడిగుండు, జరిగిన ప్రకృతి విధ్వంసం కనిపించకుండా ఉండేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరదాలు (స్క్రీన్లు) ఏర్పాటు చేసింది.
గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల భక్తిభావం పక్కన పెడితే, ప్రభుత్వం తన పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలను దాచడానికే ఈ పరదాల ఆశ్రయం తీసుకుందని స్థానికులు మండిపడుతున్నారు.ఈ విధంగా భక్తుల ఆరాధ్య దైవమైన సింహాద్రి అప్పన్న కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం పరిధిలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖపట్నంలో తీవ్ర చర్చనీయాంశమైంది.


